ఆదిబట్ల, డిసెంబర్ 3 : మహిళలను పొదుపు వైపు మళ్లించడం, తద్వారా వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తున్నది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సమన్వయంతో మహిళలకు బ్యాంకు లీంకేజీ, స్త్రీనిధీ రుణాలను ప్రభుత్వం అందిస్తున్నది. అర్హులైన మహిళలు ఈ రుణాలను పొంది స్వయం ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరుచుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో 1,758 స్వయం సహాయ సంఘాల్లో 17,924 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికి 2021 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం వరకు కోట్ల రూపాయలను రుణాలు పొంది మహిళలు చిరు వ్యాపారాల్లో రాణిస్తున్నారు.
లక్ష నుంచి 4 లక్షల వరకు రుణం
2021-22 సంవత్సరానికి ప్రభుత్వం ఇబ్రహీంపట్నం మండలంలో ఎస్హెచ్జీ సంఘాలు 903, సభ్యులు 9524 మందికి ఎస్హెచ్జీ, స్త్రీనిధి ద్వారా రూ 62.85 కోట్ల రుణాలను అందచేసింది. 2022-23 సంవత్సరానికి 425 ఎస్హెచ్జీ సంఘాలకు రూ 25 .22 కోట్ల రుణాలు మంజూరు చేసింది. మిగిలిన సంఘాలకు త్వరలోనే అందచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 535 సంఘాలకు 5200 మంది సభ్యులకి రూ 6. 25 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. 1708 మందిని వీధి విక్రయదారులను ఎంపిక చేసి 1024 మంది సభ్యులు ఒక్కరికి రూ.10 వేల చొప్పున రూ 1.24 కోట్లు, స్వయం ఉపాధి క్రింద ఆరుగురు లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొ క్కరికి లక్ష చొప్పున రూ 6 లక్షల రుణం మంజూరి చేసింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలో 320 సంఘాలలో 3200 మంది సభ్యులకు 202 1-22 సంవత్సరానికి రూ 11.07 కో ట్లు రుణం మంజూరు చేసింది. వ్యాపారాల్లో నష్టం వాటిల్లకుండా ఎస్హెచ్జీ సభ్యులు ఎంపిక చేసుకున్న వ్యాపారాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణను కూడా సంబంధిత అధికారులు ఇప్పించారు. ఎస్హెచ్జీ సభ్యులకు రుణాలను బ్యాంకులు, సెర్ప్, స్త్రీనిధి ద్వారా ప్రభుత్వమే మంజూరు చేస్తుంది. మహిళా సంఘాల సభ్యులకు రుణాల నిధులను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.
మహిళల అభివృద్ధికి ప్రోత్సాహం…
మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాలను అందిస్తున్నది. ఈ రుణాలను ప్రభుత్వం ఒక గ్రూపునకు గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అందిస్తున్నది. సభ్యులు తీసుకున్న రుణాలను సులభ వాయిదాల పద్ధతిలో ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సి ఉంది. దీంతో రుణాలు పొంది చిరువ్యాపారాల్లో రాణిస్తున్న వారిపై ఆర్థిక భారం పడడం లేదని, వడ్డీ వ్యాపారుల వేధింపులు తప్పాయని పలువురు మహిళలు చెబుతున్నారు.
సులభంగా రుణం మంజూరు
జీవనోపాధి పొందేందుకు రుణం కావాలని గ్రూపు సభ్యులు అభ్యర్థన పెట్టుకుంటే సులభంగా రుణం మంజూరవుతున్నది. రుణం కోసం సభ్యురాలు స్త్రీనిధి కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్దే ఉంటూ సభ్యులు రుణం పొందుతున్నారు. ్రస్త్రీ నిధి రుణాలు పొందేందుకు సభ్యులు దరఖాస్తు చేసుకుంటే స్త్రీనిధి అధికారులు సభ్యురాలి వేలిముద్రలు తీసుకుంటారు. రుణం మంజూరు కాగానే డబ్బులు సభ్యురాలి సంఘం ఖాతాలో జమ చేస్తారు. సంఘం సమావేశంలో తీర్మానం చేసి సభ్యురాలి ఖాతాకు సభ్యురాలికి మంజూరైన రుణాన్ని జమచేస్తారు.
నెలకు 9 వేల ఆదాయం
స్వయం సహాయక సంఘంలో రూ. 3 లక్షల రుణం తీసుకున్నా. తన ఇంట్లోనే కిరాణషాపు, అందులోనే జిరాక్సు సెంటర్ ఏర్పాటు చేసుకున్న. నెల నెల నేను తీసుకున్న అప్పు బ్యాంకులో కట్టగా తనకు నెలకు 9 వేల ఆదాయం వస్తుంది. దీంతో కుటుంబం గడుస్తున్నది.
– డబ్బికార్ మాధవి, కప్పాడు గ్రామం.
ఖర్చులు పోను సరిపడా ఆదాయం
మహిళా సంఘంలో చేరి పొదుపు చేయడం నేర్చుకున్నాను. మంచి వ్యాపారం చేయాలనే ఆలోచనతో గ్రామంలో ఏర్పాటు చేసుకున్న సరస్వతి సంఘంలో రూ1.50 లక్షల రుణంతో కిరాణాషాపు, హోటల్ నడిపిస్తున్నాను. నెలకు అన్ని ఖర్చులు పోగా రూ.15 వేల వరకు ఆదాయం వస్తుంది. ఇప్పటికీ బ్యాంకులో తీసుకున్న రుణం నెల నెల క్రమం తప్పకుండా చెల్లిస్తాను. మాకు ఇంట్లో ఉంటూ చేతినిండా పని, సంపాదన దొరికింది.
-బత్తుల సునిత, తులేకలాన్ గ్రామం
ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలి
స్వయం సహయక సంఘాలు సభ్యులకు తక్కువ వడ్డీ, సులభ వాయిదాలతో 2021-22 బ్యాంక్ లింకేజీ ద్వారా కోట్ల రూపాయలు స్త్రీ నిధి రుణాలు అందించాం. ఈ రుణాలను ఎస్హెచ్జీ మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. చిరు వ్యాపారాల్లో రాణిస్తూ ఆర్థికంగా కుటుంబాలకు అండగా నిలుస్త్తున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల సహకారంతో మరిన్ని రుణాలు అందించేందుకు కృషి చేస్తాం. 2022-23 సంవత్సరానికి కూడా సంఘాలకు రూ 35.88 కోట్లు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.
– రవీందర్, ఏపీఎం.