‘కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే.. దారితప్పి కాంగ్రెస్కు ఓటేస్తే… పదేండ్ల నుంచి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ సృష్టించిన కబ్జాకోరు రాజ్యంలో వర్షాలకు నిండిన చెరువుల నుంచి నీటిని వదిలితే కింద కొట్టుకుపోయేవని, నీళ్లు వదలకపోతే కాలనీలు మునిగే పరిస్థితి ఉండేదన్నారు. మూడేండ్ల కిందట పడ్డ భారీ వర్షాలకు మంత్రి సబితారెడ్డి వరదకు వెరవకుండా పర్యటించి సమస్యను పరిష్కరించాలని కోరడంతో వెయ్యి కోట్లను మంజూరు చేసి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టినట్లు తెలిపారు.
అలాగే శివారు దాహార్తి తీర్చేందుకు రూ.670కోట్లను మంజూరు చేశామన్నారు. మహేశ్వరంలో ముంపు, తాగునీటి బాధలను తీర్చిన సబితమ్మను మరిచిపోవద్దని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మహేశ్వరానికి మెడికల్ కాలేజీ, 500 పడకల దవాఖాన వచ్చిందని, తుక్కుగూడలో కొత్తగా 52 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఫాక్స్కాన్లాంటి కంపెనీల రాకతో లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ముస్లిం మైనారిటీ పిల్లల కోసం పహాడి షరీఫ్లో ఐటీ పార్క్ను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. కందుకూరు మెడికల్ హబ్గా మారబోతున్నదని, అలాగే కందుకూరు వరకు మెట్రో రైలు తీసుకొస్తామని చెప్పారు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయిందని, త్వరలోనే మహేశ్వరం నియోజకవర్గానికి కృష్ణానీళ్లు వస్తాయన్నారు. భూదేవంత ఓపికతో సామాన్య కార్యకర్తలా కష్టపడి పని చేస్తున్న మంత్రి సబితారెడ్డిని మరోసారి గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వర్షంలోనూ భారీ సంఖ్యలో వచ్చిన జనసందోహాన్ని చూసిన సీఎం కేసీఆర్ మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి గెలుపు ఖాయమైపోయిందని చెప్పడంతో సభలో చప్పట్లు మారుమోగాయి.
– రంగారెడ్డి, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)
బడంగ్పేట, నవంబర్ 23: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉన్నదని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రశంసించారు. ప్రజలతో మమేకమవుతూ.. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. అలాంటి వ్యక్తి మహేశ్వరం ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని అన్నారు. ఎప్పుడు చూసినా ప్రజల్లోనే ఉంటున్నారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్తోపాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీల్లోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. శాశ్విత పరిష్కారానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన కృషి మరవలేనిదన్నారు. సబితమ్మ చెప్పడం వల్లే ముంపు ప్రాంతాలకు వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. అన్ని ప్రాంతాల ముంపు సమస్య సబితమ్మ ద్వారానే పరిష్కారమయ్యిందని తెలిపారు. ప్రతీ సమస్యను కండ్లకు కట్టినట్టుగా ఫొటోలతో సహా తీసుకొచ్చి వివరించారని, పరిస్థితిని అర్థం చేసుకొని కోట్లాది నిధులు మంజూరు చేశామన్నారు.
ఆమె పట్టుపడితే వదిలే సవాల్ లేదన్నారు. కందుకూరు వరకు మెట్రో రైలు తీసుకు రావడానికి ఆమె పాత్ర మరవలేమన్నారు. మంచి పనులు చేస్తున్న సబితా ఇంద్రారెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. నియోజక వర్గంలో పట్టుదలతో పనిచేసేవారికి ప్రధాన్యత ఇవ్వాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పట్టణ ప్రాంతాలలో రూ.670 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి ఆమె ఎంతో కృషి చేశారని కొనియాడారు. పహాడీషరీఫ్లో ఐటీ పార్కు కావాలని ఆమె కోరిందని, తప్పకుండా ఏర్పాటు చేయిస్తామన్నారు. అనుక్షణం ప్రజలలో ఉంటున్న ఆమెకు పట్టం కట్టాలన్నారు. నియోజక వర్గం అభివృద్ధికి ఎంతో తపన పడుతున్నారన్నారు. ఆమె గెలుపు ఖాయమయ్యిందన్నారు.
బడంగ్పేట, నవంబర్ 23 : తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సుల్తాన్పూర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జనం తరలివచ్చారు. సుల్తాన్పూర్ అంతా జన సంద్రంగా మారింది. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెప రెపలాడుతూ కనిపించాయి. సీఎం కేసీఆర్ హాజరైన ఈ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. రెండు వేల కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చారు. అడిగిన దానికన్నా.. ఎక్కువ నిధులు కేటాయించిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలకు, మీర్పేట, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లకు వెయ్యి కోట్ల ప్రత్యేక నిధులు ఇచ్చారు. గడిచిన తొమ్మిన్నరేండ్ల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించాం.
ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సీఎం కేసీఆర్ సార్ విజన్తో పనిచేస్తున్నారు. అందుకే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నది. విద్యా, వైద్య రంగానికి ప్రాధాన్యతనిచ్చారు. సీఎం కేసీఆర్ సహకారంలో నియోజకవర్గంలో మెడికల్ కళాశాల, 9 జూనియర్, 3 డిగ్రీ, లా కళాశాలలు ఏర్పాటు చేశాం. మెడికల్ కళాశాలతో పాటు 460 పడకల ఆస్పత్రిని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. నియోజకవర్గంలో 13 బస్తీ దవాఖానలు, 8 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేశాం. వెయ్యి కోట్లతో బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జల్పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలను అభివృద్ధి చేశాం. ముంపు సమస్యను శాశ్వితంగా పరిష్కరించాం. నియోజకవర్గంలో చెరువులను సుందరీకరణ చేశాం. ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి, అవుట్ లేట్ సమస్యను పరిష్కరించాం.
మహేశ్వరంలో ఉన్న ఆస్పత్రిని అభివృద్ధి చేశాం. మహేశ్వరం, కందుకూరు మండలాలు, బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలను అందరి సహకారంతో అభివృద్ధి చేశాం. ఇంత అభివృద్ధి చేశాం.. అందువల్లే మరోసారి తనను ఆశీర్వదించాలని కోరుతున్నా. భారీ మెజారిటీతో గెలిపించాలి. మూడోసారి కె.చంద్రశేఖర్ రావు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రజల దీవెనలు ముఖ్యమంత్రిపై ఉండాలి. ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ సభలో చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ స్వీకర్ మధుసూదనా చారి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయచితం శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కార్తీక్ రెడ్డి, కౌసిక్ రెడ్డి, జెడీటీసీ జంగారెడ్డి, మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, ఇన్చార్జి ఎంపీపీ సునీతా అంద్యానాయక్, తుక్కుగూడ వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, అరవింద్ శర్మ, కందుకూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విజేందర్, మహేశ్వరం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, మహేందర్ మాదవ్, తుక్కుగూడ బీఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మయ్య, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.