బంట్వారం : ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని ఎంపీ రంజీత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని యాచారంలో గత కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న బిచ్చిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్నిపరామర్శించారు. ఆర్ఆర్ ఫౌండేషన్ తరుపున లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ పిల్లలను చదువు చదివించే బాధ్యత నాదని మృతుడి భార్యకు హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి అనేక కష్టాలు ఉంటాయని, కష్టాలు వచ్చాయని ఆత్మహత్య చేసుకుంటే సమస్యలకు పరిష్కారం దొరకదన్నారు.
క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటే కుటుంబం రోడ్డున పడుతారనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ఎవరైనా క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోరాదని ఆయన హితవు పలికారు. ఆయన వెంట ఎమ్మేల్యే ఆనంద్, స్థానిక సర్పంచ్ బల్వంత్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, నాయకులు శరణురెడ్డి ఉన్నారు.