ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. ‘మహిళలు ఆర్థికంగా ఎదగాలి.. ఆర్థిక స్వావలంబన సాధించాలి..’ అన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)ను ఏర్పాటు చేసి ప్రతిఏటా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా రుణాలను అందజేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నది. ఇందులో భాగంగానే దివ్యాంగులైన మహిళలతోనూ కొత్తగా ఎస్హెచ్జీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గ్రామాల్లో ఓటర్ల జాబితా ఆధారంగా వీఏవోలు, సీసీలతో సంఘాల ఏర్పాటుకు సర్వేను కూడా చేపడుతున్నది. ప్రతి గ్రామంలో అర్హులైన దివ్యాంగులైన మహిళలతోపాటు వృద్ధులు, కొత్తవారిని ఎంపిక చేసి వారితో సంఘాలను ఏర్పాటు చేయించి బ్యాంకు ఖాతాలను కూడా తెరిపించనున్నది. వారికీ ఇతర స్వయం సహాయక సంఘాల సభ్యుల మాదిరిగానే రుణాలను మంజూరు చేసి వ్యాపారాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతి సాధించేందుకు తోడ్పాటు అందించనున్నది. అలాగే దివ్యాంగుల సంక్షేమశాఖ నుంచి అందే ప్రయోజనాలూ సమకూరనున్నాయి. కాగా వికారాబాద్ జిల్లాలో 19,372 మహిళా స్వయం సహాయక సంఘాలుండగా అందులో 1,92,349 మంది సభ్యులున్నారు.
పరిగి, జనవరి 8 : డబ్బులు పొదుపు చేసుకోవడంతోపాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయంతో ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం సెర్ప్ ఆధ్వర్యంలో కొత్తగా దివ్యాంగులైన మహిళలతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గ్రామస్థాయిలో సర్వే సైతం చేపడుతున్నారు. మహిళల స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించేందుకు ప్రతి సంఘానికి రూ.15వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ విడుదల చేసి, సంబంధిత సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వివిధ రకాల రుణాలు బ్యాంకుల ద్వారా అందజేసి వారి ప్రగతికి తోడ్పడుతున్నది.
మహిళాభ్యున్నతిలో భాగంగా దివ్యాంగులతో గతంలో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేయించగా వాటిలో మహిళలు, పురుషులు ఉండగా, తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించకపోవడం తదితర కారణాలతో సంఘాలు ఆశించిన మేరకు ఫలితాలు సాధించలేదు. దీంతో ఈసారి ప్రత్యేకంగా దివ్యాంగులైన మహిళలతో స్వయం సహాయక సంఘాలు నెలకొల్పేందుకు అవసరమైన కసరతు జరుగుతున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో 19,372 మహిళా స్వయం సహాయక సంఘాల్లో 1,92,349 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వారికి బ్యాంకుల సహకారంతో కుటీర పరిశ్రమలు, వివిధ రకాల వ్యాపారాలకు సంబంధించిన దుకాణాలు ఏర్పాటు చేయించనున్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఉన్న దివ్యాంగులైన మహిళలతో స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు సంబంధించి సర్వే కొనసాగుతున్నది. అర్హులైన దివ్యాంగులైన మహిళలను ఎంపిక చేసి వారిని ఒక సంఘంగా ఏర్పాటు చేయించడంతోపాటు బ్యాంకు ఖాతా తెరిపించడం జరుగుతుంది. వారికి కూడా బ్యాంకు రుణాలు ఇప్పించి వ్యాపారాభివృద్ధి ద్వారా ఆర్థిక ప్రగతి సాధించేందుకు తోడ్పాటు అందిస్తారు. అలాగే దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా అందే ప్రయోజనాలు అందనున్నాయి. సెర్ప్లో పనిచేస్తున్న వీఏవోలు, సీసీలు గ్రామాల్లో సర్వే చేపడుతున్నారు.
కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ఓటర్ల జాబితా ఆధారంగా ఈ సర్వే కొనసాగుతున్నది. వివాహం చేసుకొని కోడళ్లుగా వచ్చిన వారు ఎవరైనా స్వయం సహాయక సంఘాల్లో చేరేందుకు ఆసక్తి ఉంటే వారితో ఒక సంఘం ఏర్పాటు చేస్తారు. అలాగే మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉండి 60 ఏండ్లు నిండిన వారికి బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో కేవలం వృద్ధులతోనే ప్రత్యేక సంఘాల ఏర్పాటు ప్రక్రియ సైతం కొనసాగుతున్నది. 60 ఏండ్లు పైబడిన మహిళలతోనే ఈ స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడంతో సంఘాల నుంచి పేర్లు తొలగించిన వృద్ధులు జిల్లాలో 9వేల మంది ఉన్నట్లు గుర్తించారు.
వారిలో రోజు వారి దినచర్యలు తమంతట తామే చేసుకుంటూ సమావేశాలకు వెళ్లగలిగే వారిని గుర్తించి కొత్తగా ఏర్పాటు చేసే సంఘాల్లో చేర్చుకోవడం జరుగుతుంది. వృద్ధులతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత వారు ముందుగా డబ్బులు పొదుపు చెల్లించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. తర్వాత వారు ఎలాంటి చిన్న వ్యాపారాలు చేయగలుగుతారు, ఎలాంటి సహాయం అందించాలనే అంశాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తున్నది. దివ్యాంగులు, వృద్ధులు, ఇతర మహిళలకు సంబంధించిన కొత్త సంఘాల ఏర్పాటు ఈ నెలాఖరులోపు పూర్తయ్యేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామ స్థాయిలో చేస్తున్న సర్వేకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ల్లో ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు.
దివ్యాంగ మహిళలతో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. వారికి మహిళా స్వయం సహాయక సంఘాల వారికి అందజేసే విధంగా బ్యాంకు రుణాలతో ఆర్థికాభివృద్ధితోపాటు దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా చేకూరే ప్రయోజనాలు కలుగుతాయి. 60 ఏండ్లు పైబడిన వారితోనూ ప్రత్యేకంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు జరుగుతుంది. ఈ మేరకు గ్రామాల్లో సర్వే కొనసాగుతుంది.
– రామ్మూర్తి, డీపీఎం, సెర్ప్