ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు రావంటూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో పర్యావరణ అనుమతులను సాధించడంతో పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పథకం కింద చేపడుతున్న ఐదు రిజర్వాయర్లలో ఇప్పటికే రెండు పూర్తయ్యాయి. మరో రెండు తుది దశలో ఉండగా.. ఇంకో రిజర్వాయర్ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు నిర్వహించిన డ్రై రన్ సక్సెస్ కాగా.. వెట్న్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని వదిలి రంగారెడ్డి- పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం భారీ బహిరంగ సభను సైతం నిర్వహించనున్నారు. కాగా, 16.03టీఎంసీల సామర్థ్యం ఉన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి 9 లక్షల ఎకరాలకు సాగునీరందనుండగా.. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయకట్టే అత్యధికంగా ఉన్నది. లెఫ్ట్ కెనాల్ ద్వారా వికారాబాద్ జిల్లాకు, రైట్ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరందనున్నది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6.18లక్షల ఎకరాలకు సాగునీరు, 1100 చెరువుల ద్వారా తాగు నీరు అందనున్నది. ఇందుకోసం తెలంగాణ సర్కార్ రూ.5,180కోట్లను ఖర్చు చేస్తున్నది. ‘పాలమూరు-రంగారెడ్డి’కి అన్ని అడ్డంకులు తొలిగి పనులు ఊపందుకోవడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పర్యావరణ అనుమతులు వచ్చాక ప్రభుత్వం పనుల్లో వేగాన్ని పెంచింది. ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులు నిర్వహించిన డ్రై రన్ సక్సెస్ కాగా.. ఈ నెల వెట్ రన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నార్లాపూర్ ఇన్టెక్ వద్ద స్విచ్ ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసి రంగారెడ్డి-పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. తాగునీటితోపాటు 6.18 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసే ఎత్తిపోతల కలను సాకారం చేసే దిశగా సర్కారు తీసుకుంటున్న చర్యలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకంలో సంతోషాన్ని నింపుతున్నాయి.
అంతటా ఎత్తిపోతల చర్చే..
ఓ వైపు కోర్టు కేసులు.. మరో వైపు పర్యావరణ అనుమతులు లేవంటూ విపక్షాలు చేసిన విష ప్రచారాన్ని తెలంగాణ ప్రభుత్వం పటాపంచలు చేసింది. ఎవరి ఊహకందని రీతిలో పర్యావరణ అనుమతులను సాధించడమే కాకుండా ప్రభుత్వం శరవేగంగా పనులను నిర్వహిస్తున్నది. సాకారం కాదనుకున్న ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ సాకారం చేసి చూపిస్తున్నారు. మొదటగా తాగు నీరు నీరందించేందుకు ప్రభుత్వం సంకల్పించి అందుకు ఎత్తిపోతలను సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 26న కండ్లముందే భారీ ఎత్తిపోతల నుంచి కృష్ణమ్మ పరుగులు పెట్టి నార్లాపూర్ రిజర్వాయర్లోకి పరుగులు పెట్టి మురిపించనున్నది. ఈ అపూర్వ దృశ్యం కోసం ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఈ అంకం పూర్తయ్యాక.. ప్రభుత్వం తదుపరి చేపట్టే పనులపై దృష్టిసారించనున్నది. 16.03 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్ కిందనే 9 లక్షల ఎకరాలకు సాగునీరందనుండగా.. ఇందులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆయకట్టే అత్యధికంగా ఉంది. లెఫ్ట్ కెనాల్ ద్వారా వికారాబాద్ జిల్లాకు, రైట్ కెనాల్ ద్వారా రంగారెడ్డి జిల్లాకు నీరందించేలా డిజైన్ చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 6.18 లక్షల ఎకరాలకు సాగునీరు, 1100 చెరువుల ద్వారా తాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.5,180 కోట్లను వెచ్చిస్తున్నది. కొంత ఆయకట్టుకు వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి కూడా సాగు నీరందనున్నది. గతంలోనే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి చేపట్టాల్సిన ప్రధాన కాలువల నిర్మాణానికి టెండర్లను పిలిచింది. కొద్దిరోజుల క్రితమే వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి నీరందించేందుకు మూడు ప్యాకేజీల్లో చేపట్టే హై లెవెల్, లో లెవెల్ కెనాల్ నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇవన్నీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఏ పల్లెలో చూసినా ఎత్తిపోతలపైనే చర్చ జరుగుతున్నది.
యుద్ధప్రాతిపదికన పనులు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నది. ఇప్పటికే ఈ పథకం కింద చేపడుతున్న ఐదు రిజర్వాయర్లలో రెండు పూర్తవ్వగా.. మరో రెండింటి పనులు చివరి దశలో ఉన్నాయి. మరో రిజర్వాయర్ పనులను సైతం వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు వారం రోజుల క్రితం నిర్వహించిన డ్రై రన్ సక్సెస్ కావడంతో వెట్ రన్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించి ఈ నెల 16న వెట్ రన్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోసే ప్రక్రియను ప్రారంభించనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ ఉండనున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, రైతులు పెద్దఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేయనున్నారు. నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటి ఎత్తిపోతల సందర్భంగా దక్షిణ తెలంగాణకు పండుగ వచ్చిన సంతోషం కలుగుతున్నదని రైతాంగం పేర్కొంటున్నది.
ఉమ్మడి జిల్లాకు జీవం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు, తాగు నీరు అందించి శాశ్వత పరిష్కారం చూపే దిశగా గతంలో ఏ ప్రభుత్వాలూ సాహసించలేదు. కానీ.. నీళ్లు, నిధుల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ సాగు, తాగునీటికి పెద్దపీట వేసి సాకారం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మిషన్ భగీరథతో ఎన్నో ఏండ్ల తాగునీటి తండ్లాటను తీర్చారు. మిషన్ కాకతీయ పథకం ఫలితంగా చెరువులన్నింటిలో నీటిని ఒడిసిపట్టడంతో భూగర్భ జలాలు పెరిగాయి. వృథాగా వాగుల్లో పారుతున్న నీటిని ఒడిసిపట్టేందుకు చెక్ డ్యాంలను ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్యల ఫలితంగా అదనంగా ఆయకట్టు అందుబాటులోకి వచ్చి గడచిన తొమ్మిదేండ్లలో పంటల సాగు మూడింతలు పెరిగింది. ఈ నేపథ్యంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి జిల్లాకు జీవం పోసి తాగు, సాగు నీటి ఇబ్బందులనేవే లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తుండడంతో ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నది. కృష్ణమ్మ బిరబిరా బీడు భూములను తాకనుండడంతో అన్నదాతలు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.పాలమూరు
పరుగు పరుగున..