షాద్నగర్ రూరల్, జనవరి 29 : ఫరూఖ్నగర్ మండలంలోని చిన్న గ్రామం.. గతంలో బూర్గుల అనుబంధ గ్రామం.. నేడు ప్రత్యేక గ్రామపంచాయతీగా మారి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. దాతలు, పాలకవర్గం, గ్రామస్తుల సంపూర్ణ సహకారంతో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది కాశిరెడ్డిగూడ గ్రామం… ఎన్.హెచ్ 44కు కూత వేటు దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని గత ఉమ్మడి పాలనలో పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే గ్రామ రూపురేఖలు మారాయి. పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 500 జనాభా దాటిన అనుబంధ గ్రామాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చింది. కాశిరెడ్డిగూడ గ్రామంలో మొత్తం 8 వార్డులు, 250 కుటుంబాలు, 1000 మంది జనాభా, 667 మంది ఓటర్లు ఉన్నారు. నూతన పంచాయతీగా ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది.
అభివృద్ధి ఇలా..
ప్రతి వార్డులో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాల్వలు, ఇంటింటికీ మిషన్భగీరథ కుళాయిలు, ప్రతి ఇంటి వద్ద హరితహారంలో నాటిన మొక్కలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ప్రతి వార్డులో ఎల్ఈడీ బల్బులు, రోడ్డుకు ఇరువైపులా హరితహారం మొక్కలు, నిత్యం పంచాయతీ సిబ్బంది చెత్త సేకరణ, 60వేల లీటర్ల మిషన్భగీరథ వాటర్ ట్యాంక్, క్రీడా ప్రాంగణం, వైకుంఠధామం, డంపింగ్యార్డు ఇలా వివిధ అభివృద్ధి పనులతో గ్రామం కనువిందు చేస్తున్నది. పల్లెప్రకృతి వనంలో 4 వేల మొక్కలు అందుబాటులో ఉన్నాయి.
వంద శాతం పన్నుల చెల్లింపు..
గ్రామస్తులు 100 శాతం పన్నులు చెల్లిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు.
సమష్టి నిర్ణయాలు తీసుకోవడంతో వల్ల గ్రామం సుందరంగా మారింది.
నిధుల కేటాయింపు..
– రూ.20 లక్షలతో గ్రామపంచాయతీ భవనం
– రూ.20లక్షలతో వార్డుల్లో సీసీ రోడ్లు
– రూ.8లక్షలతో అంతర్గత మురుగుకాల్వలు
– రూ.20లక్షలతో మిషన్భగీరథ ట్యాంక్
– రూ.12లక్షలతో శ్మశాన వాటిక
– రూ.3లక్షల37వేలతో క్రీడా ప్రాంగణం
-రూ.2 లక్షలతో కంపోస్టుయార్డు
దాతల సహకారంతో..గ్రామంలో గ్రామపంచాయతీ భవనం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేకపోవడంతో శ్రీనాథ్ రోటో ప్యాక్, బ్లెండ్ కలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , పాతపల్లి రంగారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిల సహకారంతో 4 గుంటల భూమిని కొనుగోలు చేసి గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించారు. గ్రామ ఆవరణలో గాంధీజీ విగ్రహం, ప్రతి వార్డులో స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రగతివెల్ఫేర్ సొసైటీ సభ్యులు గ్రామాభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపడమే లక్ష్యం. గ్రామ పాలకులు, గ్రామస్తుల సహకారంతో ముందుకెళ్తున్నాం. సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, వైకుంఠధామం, డంపింగ్యార్డు తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశాం.
– దీనశంకర్, కాశిరెడ్డిగూడ సర్పంచ్
చాలా సంతోషంగా ఉన్నది..
నూతన పంచాయతీగా ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే గ్రామంలోని అభివృద్ధి పనులను చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. గతంలో మా గ్రామం అస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణ సర్కార్ వచ్చాకే గ్రామ రూపురేఖలు మారాయి.
–శంకర్, కాశిరెడ్డిగూడ గ్రామస్తుడు