HomeRangareddyState Govt Neglects Tourism Development In Ananthagiri Hills
అటకెక్కిన ఎకో టూరిజం.. అనంతగిరి పర్యాటకాభివృద్ధిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికంగా ఉంటున్నది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనాలు క్యూ కడుతుండడంతో బీజాపూర్ హైవేపై వాహనాల రద్దీ పెరిగిపోతున్నది.
స్వదేశ్ దర్శన్లో భాగంగా ఎంపికైన అనంతగిరి
213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు
రూ.118 కోట్లతో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
డీపీఆర్ పూర్తై ఏడాదైనా ఇప్పటికీ ప్రారంభం కాని టెండర్ల ప్రక్రియ
వికారాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. ప్రతిరోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య అధికంగా ఉంటున్నది. హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనాలు క్యూ కడుతుండడంతో బీజాపూర్ హైవేపై వాహనాల రద్దీ పెరిగిపోతున్నది. అనంతగిరిహిల్స్ అందాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ పెరిగినా పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై మాత్రం కాంగ్రెస్ సర్కార్ విస్మరిస్తున్నది. నిత్యం అనంతగిరి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు కనీస వసతుల్లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. సొంత సెగ్మెంట్ అభివృద్ధిపై చూపిస్తున్న ప్రేమను.. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాలు, తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరిహిల్స్పై చూపకపోవడంపై జిల్లా ప్రజానీకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అనంతగిరి ఎకో టూరిజంపై బడ్జెట్లో ప్రస్తావించినా ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతంలోనే కొంతమేర నిధులను కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా అనంతగిరి హి ల్స్ పర్యాటక అభివృద్ధికి కేటాయించలేదు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న అనంతగిరిహిల్స్ పర్యాటక అభివృద్ధిపై అటు సీఎం, ఇటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ పట్టించుకోకపోవడంతో జిల్లా మేధావులు, విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.
213 ఎకరాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి డీపీఆర్..
అనంతగిరి ఎకో టూరిజానికి సంబంధించి 213 ఎకరాల్లో అభివృద్ధి చేయాలని రూపొందించిన డీపీఆర్ను ఆమోదించారు. ఈ 213 ఎకరాల్లోంచి 177 ఎకరాల్లో ఎకో టూరిజంతోపాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్, రిసార్ట్, కాటేజెస్, ఆంపి థియేటర్, అటవీ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, శారీరక దృఢత్వానికి యోగా, ధ్యాన కేంద్రాలు, స్పా, స్విమ్మింగ్పూల్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అనంతగిరి అటవీ ప్రాంతంలోని వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్ల నిర్మాణం, ట్రెక్కింగ్, రోప్వేను కూడా నిర్మించాలని ప్రణాళికను రూపొందించారు.
మరో 36 ఎకరాల్లో పార్కింగ్ ఏరియా, రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి, గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్లోని అనంతపద్మనాభస్వామి ఆలయం చుట్టూ సుందరీకరణతోపాటు పార్కింగ్ ఏరియా, లైటింగ్, ఫంక్షన్ హాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ను అభివృద్ధి చేయనున్నారు. కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టులనూ టూరిజం స్పాట్గా డెవలప్ చేయనున్నా రు. అదేవిధంగా ఆ ప్రాజెక్టుల్లో కాటేజ్లు, రెస్టారెంట్లు, బోటింగ్, స్పీడ్ బో ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఆంపి థియేటర్, రిసెప్షన్, ఆర్చ్లను ఏర్పాటు చేయనున్నారు. కాగా, అనంతగిరి హిల్స్తోపాటు కోట్పల్లి, సర్పన్పల్లి ప్రాజెక్టుల్లో టూరిజం అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రూ.118 కోట్లను ఖర్చు చేసేందుకు ప్రతిపాదించాయి.
పెండింగ్లోనే టెండర్ల ప్రక్రియ..
అనంతగిరి టూరిజం అభివృద్ధికి సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్కు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు డీపీఆర్కూ ఆమోదం తెలిపింది. డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్)కు ఆమోదం తెలిపి ఏడాది గడిచినా ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియపై ఆలోచనే చేయలేదు. గత పార్లమెంట్ ఎన్నికల సమయం లో స్వదేశ్ దర్శన్లో భాగంగా జిల్లాలోని అనంతగిరి హిల్స్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించి ఎంపిక చేసింది. ఇందుకోసం కేంద్రం నిధులు ఇవ్వనుండగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను వెచ్చించాల్సి ఉన్నది. అయితే, పార్లమెంట్ ఎన్నికల అనంతరం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతగిరి హిల్స్ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై ఆసక్తి చూపడం లేదు.
పర్యాటకులకు ఇబ్బంది..
తెలంగాణ ఊటీగా పిలవబడుతున్న అనంతగిరిహిల్స్కు పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్ర రాజధానికి సమీపంలో కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో సెలవులొస్తే చాలు నగరవాసులు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు అనంతగిరిలో వాలిపోతున్నారు. అంతేకాకుండా ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో 5 నుంచి 6 వేల వరకు పర్యాటకులు అక్కడికి వస్తున్నారు. వారాంతల్లోనూ పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. అనంతగిరిలోని ప్రసిద్ధ పద్మనాభస్వామిని దర్శించుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలోని వ్యూ పాయింట్లను వీక్షించడం, ట్రెక్కింగ్ చేసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
కెరెళ్లి వెళ్లే దారిలో ఉన్న నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతం లో నుంచి వచ్చే వాటర్ పాల్స్ వద్ద పర్యాటకులు సేద తీరుతున్నారు. అనంతగిరికా హవా…లాకో రోగోంకా ధవా(అనంతగిరి గాలి లక్ష రోగాలకు మందు) అని నానుడి కూడా ఉన్నది. అనంతగిరి అడవిలోని ఔషధ మొక్కలతో రోగాలు నయమవుతాయన్న నమ్మకంతోనూ చాలా మంది పర్యాటకులు ఈ కొండకు క్యూ కడుతున్నారు. మరోవైపు అనంతగిరి అడవుల్లో జింకలతోపాటు వందల రకాల పక్షులు, నిశాచర జంతువులు, వివి ధ రకాల సీతాకోక చిలుకలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ కొండ దగ్గర కనీస వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.