మొయినాబాద్, ఫిబ్రవరి 23 : జాగిలాలు అప్యాయతలకు.. విశ్వాసానికి ప్రతీక అని.. నేరాలను నియంత్రించడంలో జాగిలాల పాత్ర కీలకమని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలీజెన్స్ ట్రైనింగ్ అకాడమిలో ఏడాది పాటు శిక్షణ పొందుతున్న పోలీసుల జాగిలాల 23వ బ్యాచ్ పాసింగ్ ఔట్ శుక్రవారం ఉదయం జరిగింది. కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో కేసుల్లో నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరించాయని చెప్పారు.
జాగిలాలు కనబర్చుతున్న ప్రతిభ , క్రమ శిక్షణ చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఐఐటీఏలో జాగిలాలకు అందిస్తున్న శిక్షణ ఏ రాష్ట్రంలో లేదన్నారు. ఇతర రాష్ర్టాల పోలీసుల అధికారులు తమ రాష్ట్ర జాగిలాలకు కూడా శిక్షణ ఇవ్వండి అని మన రాష్ట్ర ఐఐటీఏ అధికారులను కోరుతున్నారని చెప్పారు.
ఇప్పటికే పలు రాష్ర్టాల జాగిలాలకు తెలంగాణ రాష్ట్రంలోని ఐఐటీఏలో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. ఇంటలీజెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది ఉత్తమ ప్రతిభ కనబరస్తూ ఇటీవల జాతీయ స్థాయి డ్యూటీ మీట్లో పతకాలు సాధించారని చెప్పారు. తెలంగాణ పోలీసులు అత్యధిక పురస్కారాలు అందుకుంటున్నారని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారని తెలిపారు.
– బి శివధర్రెడ్డి, ఇంటలీజెన్స్ అడిషనల్ డీజీపీ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఇంటలీజెన్స్ ట్రైనింగ్ అకాడమిలో పొందుతున్న జాగిలాలు ఉత్తమ ప్రతిభ కనబర్చి దేశంలోని ఇతర రాష్ర్టాల పోలీస్ శాఖల నుంచి ప్రశంసలు పొందుతున్నాయని ఇంటలీజెన్స్ అడిషనల్ డీజీపీ బి శివధర్రెడ్డి అన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఐఐటీఏ అధికారులు, సిబ్బంది ఎంతో ప్రగతిని సాధించిందన్నారు.
– తప్సిర్ ఇక్బాల్, ఇంటర్నెట్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ
మొయినాబాద్లోని ఐఐటీఏలో ఇప్పటి వరకు 771 జాగిలాలకు శిక్షణ ఇచ్చినట్లు ఇంటర్నెట్ సెక్యూరిటీ వింగ్ డిఐజీ తప్సిర్ ఇక్బాల్ తెలిపారు. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన జాగిలాలకూ శిక్షణ ఇచ్చామన్నారు. ఏడాది పాటు 21 జాగిలాలకు, 28 మంది కనైన్ హ్యాండర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, 23వ బ్యాచ్లో పాసింగ్ ఔట్ చేసినట్లు చెప్పారు.
ఉత్తమ ప్రతిభ కనబర్చిన జాగిలాలకు, కనైన్ల హ్యాండర్లకు డీజీపీ బహుమతులను అందజేశారు. ఐఐటీఏలో నూతనంగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్ను డీపీజీ రవిగుప్తాతో పాటు ఐపీఎస్ అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఐజీపీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ రమేశ్, ఐపీఎస్ అధికారులు అరోనా సింగ్ ఠాకూర్, ఎస్ జెడ్ ఖాన్, భాస్కరన్, శ్రీనివాస్, ఐఐటీఏ ఇన్చార్జి ప్రిన్సిపల్ అరవిందరావు, తదితరులు పాల్గొన్నారు.