రంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రానున్న రెండు నెలల పాటు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని, ప్రజలకు ఎకడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి వేసవి తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాల మౌలిక వసతుల కల్పన, వేసవిలో ఉష్ణోగ్రతలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శశాంక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ తాగునీటి సరఫరాలో వచ్చే చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిషరించాలన్నారు.
ప్రతి గ్రామం, మున్సిపల్ వార్డు స్థాయిలో తాగునీటి సరఫరాకు ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. తాగునీటి పైప్ లైన్ లీకేజీలు అరికట్టాలన్నారు. పనిచేయని బోరు బావులను, చేతి బోర్లను మరమ్మతులతో పునరుద్ధరించాలన్నారు. తాగునీటి సరఫరాలో ఎకడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు.
క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఇంజినీర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు సమన్వయంతో తాగునీటిని సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి లభ్యత, సరఫరా పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమస్యలు ఏర్పడే ప్రాంతాలను గుర్తించాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
వికారాబాద్ : రానున్న 2 నెలల పాటు పక్కా ప్రణాళికతో తాగునీటి సరఫరా చేపట్టాలని , ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి వేసవి తాగునీటి సరఫరా ప్రణాళిక, ధాన్యం కొనుగోలు, పాఠశాల మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికారాబాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి సరఫరా పై అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుని సన్నద్ధంగా ఉన్నామని, ప్రతి రోజు తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలని ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి కోతలు జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన మేర ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రం లేని కారణంగా రైతులు ప్రైవేట్ కు తక్కువ ధరకు ధాన్యం విక్రయిస్తున్నారనే మాట రావద్దని సీఎస్ స్పష్టం చేశారు.
వీసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ , లింగ్యా నాయక్, డి పి ఓ జయసుధ, డీఈఓ రేణుక దేవి , అధికారులు రాజేశ్వర్, సుగుణ బాయి,డీ.ఎం.హెచ్.ఓ తదితరులు పాల్గొన్నారు.