రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 53,050మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా 255 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,108 మంది సప్లమెంటరీ పరీక్షలు రాయనున్నారు. పరీక్షా పత్రాలను నిల్వ ఉంచడానికి 37స్టోరేజీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 163 సెక్షన్ను అమలులో ఉంచారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి ఇన్విజిలేటర్ల ఏర్పాటుతో పాటు ఫ్లయింగ్స్వాడ్, సిట్టింగ్ స్వాడ్లను కూడా నియమించారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఫ్యాన్లు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. అలాగే మాస్ కాపీయింగ్ నివారించేందుకు ఫ్లయింగ్ స్వ్యాడ్లు, సిట్టింగ్ స్వ్యాడ్లను నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షించనున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ధైర్యం చెప్పి ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి ప్రోత్సహించాలని సూచించారు.
భయం వీడి.. భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రంగారెడ్డి జిల్లా విద్యాధికారి సశీందర్రావు సూచించారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి తమ భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. భయంతో పరీక్షా కేంద్రాల్లో అధైర్య పడవద్దని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. శుక్రవారం మొయినాబాద్ పరిధిలోని హిమాయత్నగర్, చిలుకూరు, అజీజ్నగర్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అనంతరం మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న మండల వనరుల కేంద్రాన్ని నూతనంగా ముస్తాబు చేయడంతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకుంటే ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రధానంగా హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకుని రావడంతో పాటు పరీక్ష రాయడానికి కావాల్సిన మెటీరియల్ను తీసుకు రావాలని సూచించారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్బాబు తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు పోలీసులు సహకరించాలన్నారు. ప్రశ్నపత్రాలను భద్రంగా పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు తరలించాలని, అలాగే తిరిగి జవాబు పత్రాలను పంపే సమయంలో ఎస్కార్ట్ బృందాలు అందుబాటులో ఉండాలని సూచించారు. నిషేధిత వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకు రావదన్నారు. పరీక్షలు జరిగే సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పేపర్ లీకేజీ పుకార్లను అరికట్టడానికి స్పెషల్ స్వ్యాడ్స్, మఫ్టీ పోలీసులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. అధికారుల సూచనల మేరకు మహేశ్వరం, షాద్నగర్, చేవెళ్ల జోన్ల నుంచి ప్లయింగ్స్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వికారాబాద్ : జిల్లాలో నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ స్నేహ మెహ్రా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లాలోని మొత్తం 69 పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (పాత సెక్షన్ 144 సీఆర్పీసీ) అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదు గురికి మించి గుంపులుగా చేరడం నిషేధమన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు లేదా మైకులు, డీజేలతో ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేశామన్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు, నిషేధిత వస్తువులు తీసుకురావడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.