ఇబ్రహీంపట్నం/బొంరాస్పేట, జనవరి 7;పదోతరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఉపాధ్యాయులు ప్రత్యేక శిక్షణా తరగతులు, స్లిప్ టెస్టులు, వారాంతపు పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. ఇంటివద్ద కూడా తప్పనిసరిగా చదివేలా ఒక్కో టీచర్ కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొని పర్యవేక్షిస్తున్నారు. రాత్రి పది గంటలవరకు, మళ్లీ ఉదయం 5గంటలకే నిద్రలేచి చదివేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫోన్ చేసి అప్రమత్తం చేస్తున్నారు. పాఠ్యంశాల్లో సందేహాలున్నా ఫోన్లోనే నివృత్తి చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మెళకువలు నేర్పుతున్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో 986 పాఠశాలలుండగా, 47,723 మంది పదోతరగతి విద్యార్థులున్నారు. వికారాబాద్ జిల్లాలో గతేడాది ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో బొంరాస్పేట మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ స్కూల్ను స్ఫూర్తిగా తీసుకుని ఈసారి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈసారి మొత్తం 437 మంది విద్యార్థులు ఎస్సెస్సీ చదువుతున్నారు. ఈ విద్యార్థులకు రూ.3,69,702 వ్యయంతో ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక ట్యూటర్లను నియమించి శిక్షణ ఇప్పిస్తున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది మేలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో బొంరాస్పేట మండలంలోని బొట్లవానితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, చౌడాపూర్ మండలం కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాల, పరిగి ఎస్టీ బాలుర వసతి గృహం విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బొట్లవానితండా పాఠశాల వరుసగా మూడేండ్లు వందశాతం ఉత్తీర్ణత సాధించింది. దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది కూడా జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారు.
జిల్లాలో ఐదు ఆశ్రమ పాఠశాలలు.. ఐదు వసతి గృహాలు
వికారాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో బొట్లవానితండా, బండెల్కిచెర్ల, మర్పల్లి, కొత్తపల్లి, రాంపూర్లో ఐదు ఆశ్రమ పాఠశాలలుండగా, వీటిలో 304 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూరు, ముజాహిద్పూర్ వసతి గృహాల్లో 133 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల నుంచి 437 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలకు హాజరవుతున్నారు. పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు. ఇందుకోసం రూ.3,69,702 ఖర్చు చేస్తున్నారు. స్టడీ మెటీరియల్లో ఒక్కో విద్యార్థికి జామెట్రీ బాక్స్, మూడు నోటు పుస్తకాలు, గైడ్లు, చేతి గడియారం, రైటింగ్ ప్యాడ్, క్యాలికులేటర్.. ఇలా రూ.846 విలువ గల స్టడీ మెటీరియల్ అందిస్తున్నారు.
మూడు విభాగాలుగా విద్యార్థులు
ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులను మూడు విభాగాలుగా విభజించి వారి చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. చదువులో రాణిస్తూ తెలివైనవారు, మధ్యస్థ ప్రతిభ కలవారు, చదువులో వెనుకబడి ప్రత్యేక శ్రద్ధ అవసరమైనవారుగా గుర్తించారు. వారిని సబ్జెక్టులవారీగా ఉపాధ్యాయులకు అప్పగించి తీర్చిదిద్దుతున్నారు. డిసెంబర్ నుంచి ప్రత్యేక తరగతుల నిర్వహణ ప్రారంభించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ప్రతిరోజూ ఉదయం పరీక్షలు నిర్వహించి సాయంత్రం ఫలితాలు వెల్లడించి సమీక్షిస్తూ వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణకు ఆంగ్లం, గణితం, తెలుగు, సామాన్యశాస్త్రంలో బోధనకు ట్యూటర్లను నియమించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వసతి గృహాల్లోనే ప్రత్యేక తరగతులు కొనసాగిస్తున్నారు. వీరికి నెలకు రూ.1500 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు.
అల్పాహారం కోసం రూ.20
ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అలసిపోకుండా చదువుపై ఏకాగ్రత పెంచడానికి గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక అల్పాహారం అందిస్తున్నది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రూ.20 ఖర్చు చేస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించే సాయంత్రం వేళల్లో టీ, బిస్కెట్లు, పండ్లు వంటి వాటిని విద్యార్థులకు అందిస్తారు. జనవరి 1 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యే వరకు వీటిని కొనసాగిస్తారు.
ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
– కోటాజీ, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి
జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఐదు ఆశ్రమ పాఠశాలలు, ఐదు వసతి గృహాల్లో ఈ ఏడాది పదో తరగతిలో వంద శాతం ఫలితాల సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా విద్యార్థులకు డిసెంబర్ నుంచే ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నాం. విద్యార్థులు మంచి మార్కులు సాధించేలా స్టడీ మెటీరియల్ను అందిస్తున్నాం. ట్యూటర్లను నియమించి చదువు చెప్పిస్తున్నాం. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ రూ.50 వేల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకుని పదిలో మంచి ఫలితాలు సాధించాలి.