సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడం, మరోవైపు గ్రామపంచాయతీల్లో పాలన చూడాల్సిన ప్రత్యేకాధికారులు పత్తా లేకుండా పోవడంతో గ్రామపంచాయతీల్లో పాలన అధ్వానంగా మారింది. కాంగ్రెస్ సర్కారు నయా పైసా కూడా విదల్చకపోవడంతో పంచాయతీ కార్మికులకు కూడా జీతాలు అందని పరిస్థితి నెలకొన్నది. జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీల్లో పర్యటించేందుకు వస్తే తప్ప ప్రత్యేకాధికారులు గ్రామపంచాయతీలకు రావడంలేదని ప్రజలు చెబుతున్నారు. కనీసం వారానికి ఒక్కరోజు కూడా గ్రామాలకు ప్రత్యేకాధికారులు రాకపోవడంతో గ్రామపంచాయతీల్లో నెలకొన్న సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకాధికారులు బాధ్యతలను విస్మరించడంపై కలెక్టర్ సీరియస్ అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతున్నది.
– వికారాబాద్, జూన్ 10 (నమస్తేతెలంగాణ)
ప్రత్యేకాధికారులుగా నియమించిన తర్వాత నెలరోజులపాటు వారంలో రెండు, మూడు రోజులు వెళ్లిన ప్రత్యేకాధికారులు తదనంతరం గ్రామపంచాయతీల్లో నయా పైసా నిధులు కూడా లేకపోవడంతో పోవడం మానేశారు. జిల్లాస్థాయి మొదలుకొని మండలస్థాయి వరకు అన్ని శాఖల అధికారులకు గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతలు అప్పగించారు. ఆయా శాఖల్లోని రెగ్యులర్ పనులతోపాటు ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రత్యేకాధికారి పనులను కూడా నిర్వహించాల్సిన పరిస్థితి.
ఒక్కో అధికారికి రెండు గ్రామాలకు ప్రత్యేకాధికారిగా నియమించిన జిల్లా ఉన్నతాధికారులు పక్కపక్క గ్రామాలు కాకుండా ఆయా మండలాల్లోని అటు చివర, ఇటు చివర గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారుల బాధ్యతలు అప్పగించడం కూడా సమస్యగా మారింది. సోమవారం ప్రజావాణిలో ప్రత్యేకాధికారులుగా ఉన్న పలువురు జిల్లా అధికారులపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను పట్టించుకుంటున్నారా, ప్రత్యేకాధికారులుగా ఉన్న గ్రామాలకు వెళ్తున్నారా అంటూ జిల్లా గనుల శాఖ ఏడీతోపాటు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్, జిల్లా వ్యవసాయాధికారి తదితరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు గత వేసవి సమయంలో గ్రామపంచాయతీల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మరమ్మతుల పనులకు సంబంధించి పూర్తి చేసిన పనుల బిల్లులే రాకపోవడంతో ప్రత్యేకాధికారులు గ్రామపంచాయతీలవైపు చూడడం లేదనే వాదన వినిపిస్తున్నది. మరోవైపు ఎన్నికలు నిర్వహిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయనుకుంటే ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తుండడంతో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారనేది స్పష్టత లేకుండా పోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామపంచాయతీలుగా రూపుదిద్దుకున్న గ్రామపంచాయతీల్లో పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా అవార్డులను సొంతం చేసుకున్న గ్రామపంచాయతీల్లో పాలన ఏడాదిలో అస్తవ్యస్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నయా పైసా నిధులివ్వకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. ప్రత్యేకాధికారులను నియమించడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోవడంతో అభివృద్ధి కుంటుపడింది.
వేసవికాలంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేసిన మరమ్మతులు, తదితర పనులకు సంబంధించి స్థానికంగా చిన్నచిన్న కాంట్రాక్టర్లు చేసిన ఖర్చు రూ.4 కోట్ల నిధులు కూడా ఇప్పటివరకు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలు దేశంలోనే ఆదర్శంకాగా, ప్రస్తుతం పరిస్థితి అధ్వానంగా మారింది. గతేడాదిగా పంచాయతీ కార్మికులకు జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కనీసం డ్రైనేజీ పైప్లైన్లకు కూడా మరమ్మతులు చేయలేని పరిస్థితి నెలకొనడంతో గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అద్దంలా మెరిసిన గ్రామపంచాయతీల్లోని రోడ్లు ప్రస్తుతం మురుగునీటితో దర్శనమిస్తున్నాయి. దీనికి తోడు వర్షాలు పడుతుండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఇచ్చిన ట్రాక్టర్లు ప్రస్తుతం మూలన పడ్డాయి. ట్రాక్టర్లకు ఈఎంఐ కట్టలేని పరిస్థితితోపాటు కనీసం డీజిల్కు కూడా డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్ల నిర్వహణ భారంగా మారింది. ట్రాక్టర్లు మూలన పడటంతో ఇంటింటికెళ్లి తడి-పొడి చెత్త సేకరించే ప్రక్రియ కూడా గ్రామాల్లో నిలిచిపోయింది.