వికారాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయడమే లక్ష్యంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో కలిపి ఇప్పటివరకు రూ.5.14 కోట్ల(68.02 శాతం) ఆస్తి పన్ను వసూలుకాగా.. మరో రూ.2.41 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉన్నది. స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రతి ఒక్కరి నుంచి ఆస్తి పన్నును రాబట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సంబంధిత అధికారులు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా నిర్దేశించిన లక్ష్యంలో 80 శాతం మేర వసూలు చేయాలని ఆదేశించారు.
గత ఐదారేండ్లుగా టార్గెట్ మేరకు ఆస్తి పన్ను వసూలవుతున్నది. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి గ్రామ పంచాయతీకీ ప్రత్యేకంగా పంచాయతీ కార్యదర్శి ఉండేలా ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించడం కూడా ఆస్తి పన్ను వసూళ్లు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు గడువు సమీపిస్తున్న దృష్ట్యా స్పెషల్ డ్రైవ్తో ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు.
జిల్లాలో ట్యాక్స్, నాన్ ట్యాక్స్లు కలిపి మొత్తం రూ.5.14 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ 50 శాతానికిపైగా వసూలుకావడం గమనార్హం. పూడూరు, పరిగి, వికారాబాద్, ధారూరు మండలాల్లో ఇప్పటివరకు అత్యధికంగా ఆస్తి పన్ను వసూలైంది.
జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాం.ఇప్పటివరకు దాదాపు 68 శాతం మేర పూర్తికాగా, మరో రూ.2.41 కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఈ నెలాఖరులోగా 80 శాతం మేర ఆస్తి పన్ను వసూలు చేస్తాం
– డీపీవో తరుణ్కుమార్