కడ్తాల్, ఫిబ్రవరి 26 : ఆలయ భూములు అన్యాక్రాంతం, ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ తెలిపారు. చెన్నకేశవస్వామి ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం తహసీల్దార్ గిరిధర్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ప్రణీత్కుమార్, ఈవో మోహన్రావులతో కలిసి వారు అన్మాస్పల్లి గ్రామానికి వెళ్లి గ్రామస్తులు, నాయకులతో మాట్లాడారు.
ఆలయ భూములను ఎవరికీ వదిలేదిలేదని తేల్చి చెప్పడంతోపాటు నిలిపివేసిన కంచె ఏర్పాటు పనులను పూర్తి చేసి భూమిలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. అనంతరం పోచమ్మగడ్డతండా సమీపంలో ఆక్రమణకు గురైన చెన్నకేశవస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్ 120లోని భూమిని పరిశీలించారు. మండల కేంద్రంలోని సర్వే నంబర్ 76లోని 6.05 ఎకరాల భూమిని పరిశీలించారు. వారంలోగా ఇక్కడ సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయడంతోపాటు కంచె, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఆంజనేయులు, సభ్యులు శాయిరెడ్డి, భాస్కర్రెడ్డి, యాదయ్యగౌడ్, ఎగిరిశెట్టి బాబు, దేవాదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్లు కృష్ణగౌడ్, బోడియానాయక్, జూనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు రామచందర్నాయక్, శేఖర్, సురేశ్, అనిల్యాదవ్, జగన్, కేశవులు, పర్వతాలు, కృష్ణయ్య, శ్రీనివాస్, మల్లేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్ 130లోని భూములకు ఇటీవలే దేవాదాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఆలయ భూమిలో అక్రమంగా వేసిన రోడ్డును తొలగించి కంచె ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై రెండు రోజుల క్రితం అన్మాస్పల్లి, శాయిరెడ్డిగూడెం గ్రామాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసి పనులను నిలిపి వేయించారు. రోడ్డు మూసివేస్తే తమ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతామని, కొంత రహదారిని వదలాలని కోరుతూ పనులను అడ్డుకున్న విషయం తెలిసిందే.