మర్పల్లి, జనవరి 4 : వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. గురువారం మర్పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభాపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రజాపాలన కార్యక్రమంలో సాధ్యమైనంత వరకు అర్హులైన ప్రతిఒక్కరూ ఆరో తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రస్తుతం అందుబాటులో లేనివారికి తిరిగి నాలుగు నెలల తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ 98 చెక్కులను అందజేశారు. భవిష్యత్తులో రూ.లక్షా116లతో పాటు తులం బంగారం లేదా రూ.లక్షాఅరవైవేల చెక్కులను అందజేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి పేద ఇంటికీ చేరేలా అమలుచేస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డు లేనివారు కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేపడుతామని, రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ఎకరానికి రూ.15 వేల రూపాయల చొప్పున అందిస్తామని తెలిపారు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు కూడా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అందించే బాధ్యత తనపై ఉందని ఆయన పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలోని రోడ్ల ఏర్పాటుకు 300 కోట్లు నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు.
అదనంగా రోడ్ల నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వానికి రూ.150 కోట్లు మంజూరుకై ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రజా పాలన గ్రామసభ అనంతరం కల్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో విజయకుమారి, డీఎల్పీవో అనిత, తహసీల్దార్ గణేశ్, ఎంపీడీవో అనిత, ఎంపీపీ లలిత, జడ్పీటీసీ మధుకర్, సర్పంచ్ మహబూబాబీ, ఎంపీటీసీ సంగీత, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ కొండల్రెడ్డి, నాయకులు రవీందర్, రాములు యాదవ్, ఖలీమొద్దీన్, ఫసియోద్దీన్, రమేశ్వర్, సురేశ్, శేఖర్ యాదవ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.