వికారాబాద్, డిసెంబర్ 29 : వికారాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో 2023 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ వివరాలను విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2021తో పోల్చుకుంటే 2022లో కేసులు తగ్గాయని, 2022తో పోల్చుకుంటే 2023లో ఇంకా తక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. 2023లో మొత్తంగా 3588 కేసులు నమోదయ్యాయన్నారు.
జిల్లాలో 1035 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా జిల్లాలో రూ.4.96 కోట్ల నగదు, బంగారం, లిక్కర్, గంజాయి పట్టుకున్నామన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లాలో 19 టీమ్లు ఏర్పాటు చేశామన్నారు. 25 ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రిసార్ట్స్లలో అనుమతులు లేకుండా ఈవెంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.