యాలాల, డిసెంబర్ 19 ; గ్రామీణ ప్రాంతాల్లో ఆటలకు దూరమవుతున్న చిన్నారులు దేహధూళి, కచ భారం, నోళుల వ్రేళులు, పాల బుగ్గలూ, ఎక్కడ చూస్తే అక్కడ మీరై విశ్వ రూపమున విహరిస్తుండే పరమాత్ములు ఓ చిరుతల్లారా… మీదే మీదే సమస్త విశ్వం.. మీరే లోకపు భాగ్య విదాతలు అని శ్రీశ్రీ అన్నట్లు చిన్న పిల్లలు తమ స్నేహితులతో దుమ్మనకా, దూళనకా, వెలుగు చీకట్లను లెక్క చేయకుండా తాము విహరించే ప్రతి ప్రదేశం తమదే అనుకొనే బాల్యం ప్రతి ఒక్కరికీ ఓ మధుర స్మృతి. అలాంటి బాల్యంలో ఆడిన ఆటలు, చేసిన చేష్టలు మరపురాని తీయని భావనలు. వాటిని నెమరవేసుకుంటున్న గత, నేటి తరాలు. మరి భవిష్యత్ తరాల మాటేమిటి..?
గ్రామీణ ప్రాంతాల్లో కొద్దో గొప్పో ప్రాచీన ఆటలు కనబడుతుంటాయి. నేడు క్రమక్రమంగా అవికూడా అందనంత దూరానికి తరలిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు పిల్లలకు ఆనందాలను పంచితే, చిన్న కుటుంబాలు రోగాలను పంచుతున్నాయి. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఇంట్లో ఒకరినొకరు పలకరించుకొనే సమయం లేకుండా పోయింది. పెద్దలు టీవీ సీరియల్ల మాయలో పడి తమ బరువు బాధ్యతలను గాలికొదిలేసి టీవే ప్రపంచంగా టీవీ సీరియల్లతో యుద్ధం చేస్తూ.. గెలుస్తూ, ఓడుతూ చివరకు అంతేగా అంతేగా అంటూ పిచ్చి లోకంలో విహరిస్తున్నారు. ఆ ప్రభావం పిల్లల మీద అమితంగా పడుతుంది. తామ సంతోషాలు, కష్టాలు, ఇష్టాలను, పాఠశాలలో జరిగిన చిన్న చిన్న ఆనంద క్షణాలను ఎవరితో పంచుకోవాలో అర్థం కాక స్మార్ట్ ఫోన్ గేమ్ల వైపు ఆకర్షితులై తమ బంగారు భవితను కోల్పోతున్నారు. స్మార్ట్ఫోన్ గేమ్లు, ఆన్లైన్ బెట్టింగులుగా రూపాంతరం చెంది వెనకకు రాలేక ముందుకు వెళ్లలేక మానసిక ఒత్తిడికి లోనై కనిపించనంత దూరానికి తరలివెళ్లాక అప్పుడు వారి తల్లిదండ్రులకు పిల్లలు గుర్తొస్తున్నారు. అప్పటికే జరుగార్సిన నష్టం జరిగిపోతుంది.
అనారోగ్య సమస్యలకు కేరాఫ్..
స్మార్ట్ఫోన్, టీవీలు.. పిల్లల అనారోగ్యానికి కేరాఫ్గా నిలుస్తున్నాయి. చిన్న తరగతి గదులు, స్టడీ అవర్స్తో బాల్యాన్ని చిధిమి మార్కులనే మెడల్ను మెడలో వేసి చిన్నతనం ఆనందాలు, క్రీడలను దూరం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఊబకాయం, షుగర్, బీపీ వంటి సమస్యలతో అంతు చిక్కని రోగాలతో యుద్ధం చేస్తూ గెలువలేక, గెలిచి బ్రతకలేక జీవిస్తున్నారు. రెండు పదుల వయస్సులో అరవై పదుల వయస్సును అందించడమే లక్ష్యంగా పని చేస్తున్న స్మార్ట్ఫోన్, టీవీలను వారికందిస్తున్న తల్లిదండ్రులది తప్పా.. చదువు చదువు అంటూ 12 నుంచి 18 గంటలు నిరంతరాయంగా ఒత్తిడికి గురిసేస్తున్న ఉపాధ్యాయులది తప్పా. తప్పేవరిది ఒప్పేవరిదీ…
క్రీడలను హరిస్తున్న కాంక్రిట్ జంగల్
ఆధునిక నాగరికత కొత్తరూపు సంతరించుకొంటూ బాల్య క్రీడలను పిల్లర్లుగా, చిన్నారుల ఆనందాలను మెట్లగా, ఆత్మీయతను స్లాబ్గా, అనురాగాన్ని గోడల మధ్య కానరాని ఇటుకలుగా మలచుకొని, వ్యాయామాన్ని రంగులలో మేలవించి చక్కని ఇంటిని నిర్మించుకొని చిన్నారులను పట్టణాల భవంతులలో ఖైదు చేస్తున్నదెవ్వరూ… మనం కాదా. పల్లెలను పట్టణాలుగా, పట్టణాలను మహానగరాలుగా మారుస్తూ కాంక్రిట్ జంగల్ను సృష్టిస్తుంది అక్షరాలా మనమే. పట్టణాల్లో ఇండ్లు, వెలుపలా ఆడటానికి అవకాశాలు చాలా తక్కువ. నగరాల పెరుగుదల కారణంగా సురక్షితమైన స్థలం లభ్యతలో క్షీణతకు దారితీసింది. ఆట కోసం స్థలం సమస్యగా మారింది. కొద్దోగొప్పో అక్కడక్కడా పల్లె పాఠశాలలో కొంత ఆటస్థలం ఉండడంతో ఇంకా కొన్ని గ్రామీణ క్రీడలు మిగిలి ఉన్నాయి.
ప్రాచీన క్రీడలు ఎక్కడ..
40, 50 సంవత్సరాల క్రితం ఉన్న ఆటలను అప్పటి వారు ఇప్పుడు ఎంతో గొప్పగా చెబుతారు. ఆనాటి ఆటలైన కోతికొమ్మచ్చి, దాగుడు మూతలు, తాడు బొంగరం, సీసం గోలీలు(గోలీలాట), కర్రాబిల్లా, టైర్ ఆటలు(చక్రం ఆట), తాడు ఆట, రింగాట, చమ్మ చెక్క, వంగుళ్లు.. దుంకుళ్లు, తొక్కుడు బిల్లా, ఖోఖో, చిల్లా కట్టే, కబడ్డీ, బారా కట్ట, కుంటల్లో కేరింతలు, లడ్డాట, సంచులాట, దొంగా పోలీసాట ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కాలం మారింది, మనిషి ఆలోచనా విధానం మారింది.
నేటి కాలం పిల్లలు రోబోలు
రోబోలకు మనం ఏమి చెబితే అవి చేస్తాయి. అలా నేటి పిల్లలు ఇంటికి, బడికి మాత్రమే పరిమితం అవుతున్నారు. పెద్దలూ పిల్లలతో మాట్లాడే సమయం లేక పిల్లలతో ఆడుకోవాలనే ఆలోచన లేక ఉద్యోగ సంబంధ చిరాకులతో స్మార్ట్ఫోన్తో దోస్తీ చేయడంతో వారి పిల్లలూ తమ సమయాన్ని కూడా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్, లాప్టాపుల వైపు కేటాయించడంతో ఆటల వైపు వారి దృష్టి వెళ్లడం లేదు. క్రమంగా క్రీడలు అంతరించి పోతున్నాయి. కంటి సమస్యలతో పాటు మానసిక శారీరక సమస్యలు తలెత్తుతున్నాయి.
ఏమి చేద్దాం..
ఏమి చేద్దామని నన్ను అడగడం కాదు. మనం ఏమి చేయాలో ఆలోచిద్దాం. క్రీడలను ప్రోత్సహిద్దాం. ఆ దిశగా ముందుకు సాగుదాం. మనతో పాటు మరో పది మందికి ఆ మార్గాన్ని చూపెడదాం.