ఆమనగల్లు,(మాడ్గుల) 19 : అక్రమంగా తరలిస్తున్న ఇప్పపువ్వును పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కృష్ణమోహన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం రాత్రి కానిస్టేబుళ్లు లక్ష్మయ్య, శ్రీకాంత్ నాగిళ్ల, ఫిరోజ్నగర్ గ్రామాల్లో పెట్రోలింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా డ్రైవర్ శ్రీశైలం ఇప్పపువ్వును కామారెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్లో ని శ్రీశైలంకు రవాణా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం ఆమనగల్లు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేసి ఆ వాహనాన్ని వారికి అప్పజెప్పి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.