ధారూరు, ఫిబ్రవరి 8 : పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ కోటిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మలతో కలిసి పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్యం, హరితహారం, వైకుంఠధామాలు, బృహత్ పల్లె ప్రకృతివనాలు, జాతీయ ఉపాధి హామీ పనులపై ప్రజాప్రతినిధులు మండలస్థాయి గ్రామస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాల్లో ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరేలా పని చేయాలని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జనవరి నుంచి మే వరకు మంచి వాతావరణం ఉంటుందని, ఈ సమయాల్లో రోడ్లు, బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తిచేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు పోటీ పడి పని చేయాలి
గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించినైట్లెతే ప్రజా ప్రతినిధులు విజయం సాధించినట్లేనని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఆయా ప్రాంతాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు గ్రామ పంచాయతీలకు అభివృద్ధికి బాటలు వేయొచ్చన్నారు.
వైకుంఠధామాలు, పార్కులుగా తీర్చిదిద్దాలి
వైకుంఠధామాల్లో నాటిన మొక్కలను సంరక్షించేందుకు కంచెతో పాటు బెంచీలను ఏర్పాటు చేసి పార్కులుగా తీర్చిదిద్దాలన్నారు. వైకుంఠ రథాలు, ప్రీజర్లు అందుబాటులో ఉండేందుకు గాను దాతల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్కుమార్, మిషన్ భగీరథ బాబు శ్రీనివాస్, అదనపు డీఆర్డీవో, మండలాల నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.