షాద్నగర్రూరల్/షాద్నగర్టౌన్, ఆగస్టు 30 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను గురువారం రంగారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సృష్టిలో పవిత్రమైన బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధంగా చెబుతారు. అందుకే తల్లిదండ్రులతో చెప్పుకోలేని సుఖ, సంతోషాలను సోదరీమణులు తమ సోదరులతో పంచుకుంటారు. అక్కాచెల్లెళ్లకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సోదరుడు ముందుంటాడు. అక్కాచెల్లెళ్లు తమ అన్నాతమ్ముళ్లకు రాఖీలు కడితే వారు తమకు ఉన్నంతలో డబ్బు, దుస్తులను కానుకగా ఇవ్వడం అనవాయితీగా వస్తున్నది.
అబ్దుల్లాపూర్మెట్ : మమతానురాగాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలను గురువారం జరుపుకొనేందుకు మహిళలు, యువతులు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా వ్యాపారులు విభిన్న రకాల్లో తయారైన రాఖీలను విక్రయించేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా, కవాడిపల్లి, అనాజ్పూర్ రోడ్ల వెంట, పలు ప్రాంతాల్లో షాపులు వెలిశాయి. వాటి ఆకారాలను బట్టి ఒక్కో రాఖీ రూ.6 ఉంచి 500 వరకు విక్రయిస్తున్నారు. సిల్వర్, గోల్డ్ కలర్ చైన్లతో రూపొందించిన రాఖీలు రూ.రెండు వందలకు పైగా ఉన్నాయి. అలాగే స్వస్తిక్, ఓంకారం, వివిధ రకాల పుష్పాలు, బేన్టెన్, చోటాభీమ్, ఫేస్బుక్ లోగో వంటి వెరైటీ రాఖీలు కూడా అందుబాటులో ఉన్నాయి. సామూహిక రాఖీ పౌర్ణమి వేడుకలను నిర్వహించే వారి కోసం రంగురంగుల పత్తి రాఖీలు కూడా మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. గతేడాది తో పోల్చితే ధరలు ఈ సారి 40 శాతానికి పైగా పెరిగినప్పటికీ తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు అక్కాచెల్లెళ్లు కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వస్తుండటంతో షాపులు కిటకిటలాడుతున్నాయి.