స్వయం సహాయక సంఘాల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఏటా రుణాలు అందించి స్వయం ఉపాధి కల్పిస్తుండగా ఎంతోమంది మహిళలు ఆర్థికంగా రాణిస్తున్నారు. వారు మరింత ఆర్థిక వృద్ధి సాధించేలా ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్ల సాగు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కార్యాచరణను సిద్ధం చేశారు. గతేడాది యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పంటల సాగు విజయవంతం కావడంతో ఈ ఏడాది మరో మూడు మండలాలకు విస్తరించారు. యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల, కేశంపేట మండలాల పరిధిలోని 157 గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. మొత్తం 756 మంది రైతులతో 299 హెక్టార్లలో సాగు చేపట్టి 2,741 క్వింటాళ్ల పండ్లు, కూరగాయలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అంతేకాకుండా ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో పండించిన కూరగాయలు, పండ్లను సేకరించి మార్కెటింగ్ చేసేందుకుగాను రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కంపెనీ నిర్వహణకుగాను ప్రభుత్వం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలను మంజూరు చేయనున్నది.
రంగారెడ్డి, జూలై 14, (నమస్తే తెలంగాణ) : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. మొదటి నుంచి కేవలం పొదుపు సంఘాలుగానే వ్యవహరించిన స్వయం సహాయక సంఘాల దశ దిశ మార్చుతూ ఆర్థిక వృద్ధి సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారాల్లో రాణిస్తుండగా.. సక్సెస్ఫుల్ రైతులుగా కూడా రాణించేలా మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. కొన్నేండ్లుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రతి ఏటా రుణాలను అందజేస్తున్నా ఎస్హెచ్జీ సభ్యుల ఆర్థిక పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రభుత్వం ద్వారా పొందిన రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సొంత అవసరాల నిమిత్తమే ఖర్చు చేసేవారు. దీంతో ఎస్హెచ్జీ సభ్యులు ఆర్థికంగా ఎదుగాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిర జీవనోపాధితోపాటు ఆర్థికంగా ఎదిగేలా సెర్ప్ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా లాభసాటి వ్యాపారాలను ప్రారంభించిన ఎస్హెచ్జీ సభ్యులు వ్యవసాయంలోనూ రాణించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు.
ఎస్హెచ్జీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ
స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో చేసే సాగుకు సంబంధించి ఉద్యాన శాఖ ద్వారా పందిరి పంటలతోకూరగాయల సాగు, డ్రిప్, కృషి విజ్ఞాన కేంద్రం-వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఎస్హెచ్జీ సభ్యులకు కూరగాయలు, పండ్ల సాగుకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు చెందినవారై ఉన్న ఎస్హెచ్జీలను ఒక్కో సంఘానికి ముగ్గురు నుంచి నలుగురిని ఎంపిక చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పాటు చేశారు. కూరగాయలు, పండ్ల సాగుకు తొలుత సెర్ప్ ఆధ్వర్యంలో సీడ్ ఫండ్ కింద ప్రతి సంఘానికి రూ.25వేలను అందించనున్నారు. తదనంతరం రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటైన మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. కూరగాయలను ఉత్పత్తి అనంతరం సేకరించడంతోపాటు మార్కెటింగ్ కార్యకలాపాలను రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చూసుకోనుంది.
157 గ్రామాల్లో సాగుకు నిర్ణయం
మరోవైపు ఈ ఏడాది రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, కేశంపేట మండలాల్లోని 157 గ్రామాల్లో కూరగాయల సాగుకు అధికారులు నిర్ణయించారు. యాచారం మండలంలో 92 గ్రామాలు, ఇబ్రహీంపట్నంలో 41 గ్రామాలు, మంచాల మండలంలో 22 గ్రామాలు, కేశంపేట మండలంలో 102 గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పచ్చిమిర్చి, బెండకాయ, టమాట, కాకరకాయ, వంకాయ, దోసకాయ, ఉల్లిగడ్డ, దొండకాయ, బీన్స్, ఆలుగడ్డ, క్యాబేజీ తదితర కూరగాయలను సాగు చేయనున్నారు. సంబంధిత నాలుగు మండలాల్లోని 756 మంది రైతుల ఆధ్వర్యంలో 2741 క్వింటాళ్ల ఆయా కూరగాయల పంటలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎస్హెచ్జీ సభ్యులు సాగు చేసే కూరగాయల ఉత్పత్తులను యాచారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో, కేశంపేట మండలంలో భూతల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో కూరగాయల ఉత్పత్తులను సేకరించనున్నారు.
యాచారం మండలంలో విజయవంతంగా..
జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్ల సాగుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. గతేడాది పైలట్ ప్రాజెక్టుగా యాచారం మండలంలో ప్రారంభించిన రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో కూరగాయలు, పండ్ల సాగు విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల, కేశంపేట మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో సాగు ప్రణాళికను సిద్ధం చేశారు.
బెనిషాన్ కంపెనీ ఆధ్వర్యంలో..
మహిళా రైతులు ఉత్పత్తి చేసిన కూరగాయలు, పండ్లను బెనీషాన్ కంపెనీ ఆధ్వర్యంలో పెద్ద సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇప్పటికే యాచారం, కేశంపేట మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఏర్పాటుకాగా, త్వరలోనే కందుకూరు, తలకొండపల్లి మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. రైతు ఉత్పత్తి కంపెనీల నిర్వహణకుగాను ప్రభుత్వం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తున్నది.
ఎస్హెచ్జీలు ఆర్థిక వృద్ధే లక్ష్యంగా…
– డీఆర్డీఏ ఏపీడీ కె.జంగారెడ్డి
స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్థికంగా వృద్ది చెందాలనే లక్ష్యంగా మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సాగు ప్రణాళికను చేపట్టాం. గతేడాది కేవలం యాచారంలో చేపట్టగా, ఈ ఏడాది మరో మూడు మండలాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి కూరగాయల సాగు ప్రణాళికను సిద్ధం చేశాం. అదేవిధంగా ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసే కూరగాయలను సేకరించి, మార్కెటింగ్ చేసేందుకుగాను రైతు ఉత్పత్తిదారుల కంపెనీలను కూడా ఏర్పాటు చేశాం.