షాద్నగర్ జోన్ బృందం : తెలంగాణ రాష్ట్ర రైతులపై కేంద్రం ప్రభుత్వం కక్ష కట్టిందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా సాగునీరు ప్రాజెక్టుల ఫలాలతో రైతులు వడ్లను పండిస్తే కొనేందుకు కేంద్రం ముందుకు రాకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. గొప్పలు చెప్పుకునే నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ వ్యవసాయ నల్ల చట్టాలపై పెట్టిన దృష్టిని రైతుల ధాన్యం కొనుగోలుపై పెట్టాలని సూచించారు. సోమవారం షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన టీఆర్ఎస్, రైతుల నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కేంద్రానికి ఏమి లాభమో చెప్పాలని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అన్ని వర్గాల రైతులు కేంద్రం మేడలు వంచేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనే వరకు అన్ని ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు. ఇందులో భాగంగానే దేశ ప్రధాని నరేంద్రమోది దిష్టి బొమ్మను దహనం చేసి నిరసనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, తాండ్ర విశాల, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూరు విశ్వం, కౌన్సిలర్లు కానుగు అంతయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.