షాద్నగర్రూరల్ : ఎంబీబీఎస్ డాక్టర్ల స్లిప్పులు ఉంటేనే రోగులకు మందులు ఇవ్వాలని నియోజకవర్గంలోని మెడికల్ షాపుల, మెడికల్ ఏజెన్సీల నిర్వహకులకు షాద్నగర్ ఏసీపీ కుశల్కర్ సూచించారు. పట్టణంలోని కేకేఆర్ ఫంక్షన్హాల్లో గురువారం మెడికల్ షాపుల, మెడికల్ ఏజెన్సీల నిర్వహకుల డివిజన్ స్థాయి సమావేశాన్ని డ్రగ్స్ కంట్రోల్ అథారిటి ఏడీ అంజూమ్ అభిదా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు వివిధ ఆనారోగ్య సమస్యలతో మెడికల్ షాపుకు వచ్చే వారి వద్ద డాక్టర్ స్లిపు ఉంటేనే మందులు ఇవ్వాలన్నారు.
అదే విధంగా డాక్టర్ సూచనలు లేకుండా మత్తును కలిగించే డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని సూచించారు. డాక్టర్ సూచనల ప్రకారం.. మత్తు డ్రగ్స్ ఇచ్చేటప్పుడు వైద్యుడి పేరుతో పాటు రోగికి సంబంధించిన వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలని సూచించారు. డాక్టర్ స్లిపుపై ఉన్న తేదీ నుంచి ఒకటి రెండ్రోజులు మాత్రమే మందులు ఇవ్వాలని, స్లిపు తీసుకుని పది, పదిహేను రోజులైతే మందులు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దన్నారు. డ్రగ్స్ విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నాణ్యత కలిగిన మందులను మాత్రమే విక్రయించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మందులను విక్రయించొద్దన్నారు.
ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. నిబంధనలను పాటించి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అర్హత లేని వారు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలలో వైద్యశాలను ఏర్పాటు చేసి వచ్చిరాని వైద్యంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.