షాద్నగర్ : క్రిస్మస్ పండుగను రాష్ట్రంలో క్రైస్తవులు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ సమావేశ మందిరంలో క్రైస్తవులకు ప్రభుత్వ క్రిస్మస్ కానుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతస్తులకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. ఇందులో భాగంగానే క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ క్రిస్మస్ కానుకలను అందిస్తున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో ఉన్న పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు కచ్చితంగా అందాలని అధికారులకు, మత పెద్దలను కోరారు.
యేసు ప్రభు కరుణమయుడని, ఆయన పయనించిన తీరు ఆదర్శనీయమని తెలిపారు. రాష్ట్రంలోని క్రైస్తవులు సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజ ఇద్రీస్, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, నాయకులు గుడ్డు యాదవ్, నవీన్, చర్చి పాదర్స్, మత పెద్దలు పాల్గొన్నారు.