ఒకవైపు పచ్చని చెట్లు, కొండలతో ఆహ్లాదం.. మరోవైపు కోనేరు, అతి పురాతన ఆలయం, దేవేరుల విగ్రహాలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతున్నది ఉత్తర రామలింగేశ్వరస్వామివారి దేవాలయం. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలంలోని రామేశ్వరంగ్రామంలో వెలిసిన ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఏటా చింతాకు సైజులో రామలింగం పెరుగుతుందని భక్తులు పేర్కొంటున్నారు. ద్వాపరయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగంగా చెప్పబడే ఈ రామలింగేశ్వరస్వామి కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు షాద్నగర్ నియోజకవర్గం నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన రామేశ్వరాలయం పర్యాటకంగా ప్రసిద్ధి చెందుతున్నది.
షాద్నగర్, ఆగస్టు 27 : ప్రకృతి రమణీయతకు సాక్ష్యంగా నిలిచే కొండలు. ఎటుచూసినా పచ్చదనంతో కళకళలాడుతూ భక్తిపారవశ్యం కలిగించే చెట్లు. వీటి మధ్యన అత్యంత పురాతనమైన ఆలయం. ఆలయం పక్కనే భక్తులు స్నానాలు ఆచరించేందుకు కోనేరు. మహిమాన్విత క్షేత్రంగా భావించే రామేశ్వరం ఆలయం ప్రత్యేకత ఇది. ద్వాపరయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగంగా చెప్పబడే ఈ రామలింగేశ్వరస్వామి వెలసిన ఈ ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా పేరొందుతున్నది.
రామలింగేశ్వరుని వైభం..
షాద్నగర్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా రాష్ట్రంలోని చాలమందికి ఈ రామలింగేశ్వర స్వామి ఇంటి దేవుడు. స్థానికంగా ఎవరికీ ఏ ఆపద వచ్చినా, ఎవరు నూతనంగా వాహనాలు కొన్నా ఈ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ప్రతి పౌర్ణమి, అమవాస్యలకు ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. ప్రతి శివరాత్రికి స్వామివారి బ్రహ్మోత్సవాలు (జాతర) నిర్వహించడం ఆనవాయితీ. రాష్ట్రంలోని నలుమూలతో పాటు కర్ణాటక రాష్ర్టానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. స్థానిక కోనేటిలో స్నానాలను ఆచరించి స్వామివారి, కొండపై ఉన్న అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. చాలమంది గ్రామీణులు శివరాత్రి సమయంలో మూడు రాత్రులు ఇక్కడే నిద్రించి పూజలు చేస్తారు. భజనలు, ఇతర భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.
పర్యాటక కేంద్రంగా రామేశ్వరం
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆలయం అభివృద్ధి చెందింది. కోనేరును ఆధునీకీకరించడంతో పాటు ప్రధాన రోడ్డుమార్గాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సేదతీరేందుకు వసతి గదులు, కల్యాణ మండపాన్ని నిర్మించారు. తాగునీటి వసతి, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించారు. బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రతి నెల పౌర్ణమితో పాటు ప్రతి సోమవారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతుంది. హైదరాబాద్కు సమీపంలో ఉండడం వల్ల స్వామివారిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు బారులుతీరుతారు.
ఇలా వెళ్లాలి..
రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ నియోజకవర్గం, ఫరూఖ్నగర్ మండలం రామేశ్వరం గ్రామంలో వెలిసిన ఉత్తర రామలింగేశ్వరస్వామివారి దేవాలయం షాద్నగర్ పట్టణానికి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. హైదరాబాద్, బెంగళూరు 44వ జాతీయ రహదారి రాయికల్ టోల్ గేట్ నుంచి 3 కిలోమీటర్ల దూరం అవుతుంది. షాద్నగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నిత్యం బస్సు సౌకర్యం ఉంటుంది. ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.