వికారాబాద్, ఆగస్టు 30 : వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ ప్రాజెక్టులోకి మురుగు నీరు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివసాగర్ ప్రాజెక్ట్ అనుసంధాన కాల్వను, మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ దుకాణాల సముదాయాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మంజులరమేశ్, కమిషనర్ జాకీర్ అహ్మద్, సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. వికారాబాద్ మున్సిపాలిటీలోని ప్రజలకు తాగు నీరు అందించే శివసాగర్ ప్రాజెక్టులోకి మురుగు నీరు చేరి కలుషితమవుతున్నదని, అలా జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే శివసాగర్ ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని అన్నారు.
పూడూరు మండల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లోని గ్రామాల నుంచి వచ్చే మురుగు నీరు ప్రాజెక్టులోకి రావడం వల్ల జరిగే ప్రమాదాన్ని గుర్తించిన కలెక్టర్ మురుగు నీటిని కాల్వల ద్వారా మళ్లించేందుకు చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ సుందర్ను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తాచెదారాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు సూచించారు.
మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ను సందర్శించిన కలెక్టర్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి చిరు వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.