మొయినాబాద్, డిసెంబర్ 12 : రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం మంజూరు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండటానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని సురంగల్, అజీజ్నగర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. లాటరీ విధానం ద్వారా ఇండ్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. దశల వారీగా అన్ని గ్రామాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్కుమార్, ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వర్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
పూర్వం నుంచి నీటి కుంట ఉన్నట్లుగా రెవెన్యూ రికార్డులో ఉందని, అట్టి నీటి కుంటను కబ్జా చేసి కట్టను పూర్తిగా తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. సోమవారం కంచమోనిగూడ గ్రామానికి చెందిన రైతులు ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలసి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన కంచమోనిగూడలోని సర్వే నెంబర్ 134లో 11-39 ఎకరాల భూమి ఉందని చెప్పారు. ఆ విస్తీర్ణంలో చెరువు కుంట కట్ట 60.70 మీటర్ల పొడువు ఉండేదని, అట్టి కుంట కట్టను కె నర్సింహరెడ్డి, రాజేందర్రెడ్డి, విక్రమ్రెడ్డి, సంగారెడ్డి, కె మహేందర్రెడ్డి, కె రవీందర్రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, శ్రీనాత్రెడ్డి, శివారెడ్డిలు కలిసి పూర్తిగా తవ్వేసి కుంటను పూడ్చారని తెలిపారు. అదే విధంగా కుంటలోనికి ఉన్న వరద కాలువను పూర్తిగా పూడ్చి వేయడంతో వరద నీరు రైతుల పంట పొలాల్లోనికి వస్తుందని చెప్పారు. కుంటను పూర్తిగా పూడ్చి రోడ్లు వేయడంతో పాటు పాట్లుగా చేసి విక్రయిస్తున్నారని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు. అదే విధంగా పోలీస్ స్టేషన్లో కూడా వారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు.