తాండూరు, మే 23: తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శుక్రవారం విత్తన మేళాను నిర్వహించనున్నట్లు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధారాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాల పంటల సాగు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనం అందించాలనే ఉద్దేశంతో విత్తన మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు.
నూతన వంగడాల లక్షణాలు వాటి గుణగణాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయంలో ఆధునిక సాంకేతికపై రైతుల సందేహాలు తీర్చటానికి ఆయా పంటల ప్రధాన శాస్త్రవేత్తలతో చర్చా గోష్ఠి ఏర్పాటు చేశామన్నారు. తాండూరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని రైతులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అదే విధంగా తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో తెలంగాణ కంది-3 (టీడీఆర్జీ-59), ఆశ (ఐసీపీఎల్-87119) రకాల విత్తనాలను రైతులు కొనుగోలు చేసేందుకు ఉంచామన్నారు. నాలుగు కిలోల కంది విత్తనాల ప్యాకెట్ రూ.600 ఉంటుందని తెలిపారు. ఖరీప్ సీజన్కు సంబందించిన ఇతర విత్తనాల కోసం రాజేంద్రనగర్లోని ప్రధాన వ్యవసాయ పరిశోధన కేంద్రంను సందర్శించాలని తెలిపారు.