గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒకవైపు పగలంతా వేసవిని తలపించే ఎండలు దంచికొట్టడంతో పాటు గాలిలో తేమ శాతం పడిపోవడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. మరో పక్క రాత్రి సమయంలో పలుచోట్ల తేలికపాటి వాన కురిసింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, గాలిలో తేమ 47శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాత్రి 8.30గంటల సమయంలో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది.
రాత్రి 9గంటల వరకు నగరంలోని కుత్బుల్లాపూర్, ఆదర్శ్నగర్లో అత్యధికంగా 3.75 సెం.మీలు, ఫతేనగర్లో 3 సెం.మీలు, బాలానగర్లో 2.7 సెం.మీలు, అమీర్పేట మైత్రీవనంలో 2.6సెం.మీలు, శ్రీనగర్ కాలనీలో 2.4సెం.మీలు, బోయిన్పల్లిలో 2.0 సెం.మీలు, బషీర్బాగ్లో 1.9సెం.మీలు, బంజారాహిల్స్, బేగంపేటలో 1.8సెం.మీలు, గచ్చిబౌలిలో 1.0సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. నగరంలో వర్షం కురిసిన నేపథ్యంలో బల్దియా అధికారులతో కలసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోమాజిగూడ, ప్రజాభవన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. – సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ)