రంగారెడ్డి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : పాఠశాలలు, ఎమ్మార్సీలు, స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణకు రెండో విడుతలో మంజూరు చేయాల్సిన నిధులను ప్రభుత్వం ఇటీవలే ఆలస్యంగా విడుదల చేసింది. ఈ మేరకు వివిధ విభాగాలకు రూ.48.17 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అయితే ఈ నిధులను మార్చి 31 లోపు ఖర్చు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా ఐదు రోజులే మిగిలి ఉండడం..మధ్యలో 29, 31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. నిధులు ఇచ్చినట్లే ఇచ్చి..వెనక్కి తీసుకునే ప్రయత్నంపై ఆయా వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
ప్రతి ఏటా విద్యాశాఖ పాఠశాలలకు రెండు విడుతల్లో నిధులను మంజూరు చేస్తుంది. గత జూలై-ఆగస్టు మాసంలో 50 శాతం నిధులు రాగా.. తాజాగా మిగతా సగం నిధులను విడుదల చేసింది. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు-881, ఉన్నత పాఠశాలలు-181, హైస్కూల్స్-247, కస్తూర్బాలు-20, మాడల్ స్కూల్స్-9 వరకు ఉన్నాయి. వీటి నిర్వహణకు విద్యాశాఖ రెండోవిడుత నిధుల ను మంజూరు చేసింది. ఈ నిధుల్లో చాలావరకు ఇప్పటికే ఖాతాల్లో జమకాగా.. మరికొన్ని ఖాతాల్లో నేటికీ జమ అవుతూనే ఉన్నాయి.
మొదటి విడుతలో మంజూరైన నిధులను చాలా పాఠశాలలు వివిధ కారణాలతో ఖర్చు చేయలేదని తెలిసింది. ఈ క్రమంలోనే మార్చి 31లోపు రెండో విడుతకు సంబంధించినవి ఖర్చు చేయకుంటే వెనక్కి తీసుకుంటామని విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కొద్దిరోజుల్లోనే ఈ నిధులను దేనికి ఖర్చు చేయాలో తెలియక ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ఇబ్బంది పడుతున్నారు. కొందరు బకాయిల బిల్లులను చెల్లిస్తుంటే..మరికొంతమంది వార్షిక పరీక్షలకు సంబంధించిన సామగ్రిని ఇప్పుడే కొనుగోలు చేస్తున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో వివిధ విభాగాలు వివిధ రకాలుగా వెచ్చిస్తున్నాయి. క్యూ కాంప్లెక్సుల్లో సమావేశాల నిర్వహణ, స్టేషనరీ తదితర వాటికి ఖర్చు చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణకు సంబంధించి కరెంటుతోపాటు బ్లాక్ బోర్డు, చాక్ పీస్లు, స్టేషనరీ తదితర వాటికి ఖర్చు చేస్తున్నారు. ఎమ్మార్సీ కేంద్రాల్లో కరెంటుతోపాటు టెలిఫోన్ బిల్లులు, ఇంటర్నెట్, టీ, స్టేషనరీ ఇతర ఖర్చుల కోసం వెచ్చిస్తున్నారు. కొన్నింటిని స్పోర్ట్స్కు సంబంధించి ఆట వస్తువులు, సబ్బులు, ఫినాయిల్, స్టేషనరీ తదితర వాటిని కొంటున్నారు. అయితే ఈ ఏడాదిలో నిధులను ఖర్చు చేసేందుకు పలు అడ్డంకులు ఏర్పడడంతో పాఠశాలల నిర్వహణ భారంగా మారింది.
గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎంసీ కమిటీల ఆమోదంతో నిధులను విడుదల చేసుకునేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎంసీ కమిటీలను రద్దు చేసింది. వాటి స్థానంలో ఆదర్శ మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ..ఎన్నికల కోడ్తో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సీనియర్ ఉపాధ్యాయుడితో బ్యాంకు ఖాతాలు తీయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఈ మధ్యనే బ్యాంకుల్లో ఖాతాలు తెరిచారు.
రెండో విడుత నిధులను ఆలస్యంగా ఖాతాల్లో జమ చేయడం..గడువు లోగా ఖర్చు చేయకుంటే నిధులు వెనక్కి తీసుకుంటామని చెబుతుండడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. వచ్చిన నిధులు వెనక్కిపోతే పాఠశాలల నిర్వహణ, స్టేషనరీ, ఇతర సామగ్రికి డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలని పాఠశాలల హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే నిధులను విడుదల చేసినైట్లెతే ఓ ప్రణాళిక ప్రకారం వెచ్చించడం వల్ల ప్రయోజనం ఉండేదని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి.