Grama Panchayati | షాబాద్ మండలంలో మొత్తం 41 గ్రామపంచాయతీలు ఉండగా.. స్పెషలాఫీసర్ల నియామకానికి మండలంలోని అన్ని కార్యాలయాల్లోని అధికారులు కలిపి 32 మంది ఉన్నారు. ఒక్కొక్కరికీ ఒక పంచాయతీ బాధ్యతలు అప్పజెప్పినా.. మరో తొమ్మిది మంది అవసరం. దీంతో నాన్ గెజిటెడ్ అధికారులను నియమించడమో !.. లేక రెండేసి పంచాయతీల బాధ్యతలు ఒక్కరికే అప్పజెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రంగారెడ్డి, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల కొరత ఉందనడానికి షాబాద్ మండలం ఒక ఉదాహరణ. పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో స్పెషలాఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
జిల్లాలోని 21 గ్రామ పంచాయతీల్లో రికార్డు అసిస్టెంట్ నుంచి మొదలు మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్తో సహా ఎంత మంది ఉన్నారనే వివరాలను ప్రభుత్వం అడుగగా.. అధికారులు అన్వేషణలో పడ్డారు. అయితే గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్న మండలాల్లో ప్రత్యేకాధికారుల కొరత నెలకొని ఉన్నది.
ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ అధికారులతోపాటు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల పేర్లను జిల్లా అధికారులు ప్రతిపాదించారు. తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్లు, గ్రామీణ నీటిసరఫరా శాఖ (మిషన్ భగీరథ) సహాయ ఇంజినీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ (ఐసీడీఎస్) సూపర్ వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు, ఆరోగ్య శాఖ సూపర్ వైజర్లు, ఉద్యాన శాఖ అధికారులు, గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఉప తహసీల్దార్ల పేర్లతో జాబితాను తయారు చేశారు.
ప్రత్యేకాధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ల పేర్లను జాబితాలో నుంచి తొలగించారు. ప్రత్యేకాధికారుల కొరత నెలకొన్న నేపథ్యంలో చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను ప్రత్యేకాధికారులుగా నియమించుకోవచ్చునని ప్రభుత్వం సూచించడంతో ఆ మేరకు మళ్లీ జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారిని, మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీలార్లను, పెద్ద జనాభా గల ఇతర పంచాయతీలకు ఎంపీడీవోలను, ఆ తర్వాత జనాభా ప్రాతిపాదికన డిఫ్యూటీ తహసీల్దార్లను, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించనున్నారు. ఒకవేళ ప్రత్యేకాధికారుల కొరత వస్తే.. రెండు, మూడు పంచాయతీల బాధ్యతలను ఒక్కరికే అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రత్యేకాధికారుల జాబితా రూపకల్పనను గురువారం నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిసింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొదటిసారిగా 2018 ఆగస్టులో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలనను అప్పటి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఆరు నెలలపాటు ప్రత్యేక పాలన కొనసాగించి ఆతర్వాత ఎన్నికలను నిర్వహించింది. ఆ తర్వాత ప్రత్యేకాధికారుల పాలన రావడం ఇది రెండోసారి. సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియనుండడంతో చాలావరకు పంచాయతీల్లో ఇప్పటికే రికార్డులు, చెక్ బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ప్రత్యేక పాలనలో జాయింట్ చెక్ పవర్ను పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేకాధికారి ఇద్దరికీ కల్పించింది.