రంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుక ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలు రెట్టింపై దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలుకుతున్నది. కృత్రిమ కొరతను సృష్టించి వ్యాపారులు అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తుండగా.. కొంతమంది స్థానికంగానే కృత్రిమ ఇసుక తయారీకి తెరతీస్తున్నారు. ఇసుక ధరలకు రెక్కలు రావడంతో గృహ నిర్మాణ అంచనా వ్యయం మరింత పెరిగి.. బిల్డర్లు నిర్మాణాలను వాయిదా వేసుకునే ఆలోచన చేస్తున్నారు. పెరిగిన ఇసుక ధరలతో ఇక సామాన్యులకు సొంతింటి కల భారమవుతున్నది.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, స్థిరాస్తి వ్యాపారులు పట్టణాల్లో సొంతింటి నిర్మాణాలు చేపడుతున్నాయి. మరో పక్క అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణాల జోరు సైతం జిల్లాలో పెరిగింది. నిన్నమొన్నటి వరకు పుష్కలంగా ఉన్న ఇసుకకు నేడు కొరత ఏర్పడడంతోపాటు అమాంతం ధరలు పెరిగిపోవడానికి కొత్త ప్రభుత్వంలో ఇసుక రవాణా, తవ్వకాలపై కొనసాగుతున్న అనధికార నిషేధమే కారణమని తెలుస్తున్నది. జిల్లాలో ఇసుక రీచ్లు లేకపోవడంతో కాళేశ్వరం, భద్రాచలం, కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లోని ఇసుక రీచ్ల నుంచి ఇసుకను వ్యాపారులు రంగారెడ్డి జిల్లాకు తరలిస్తున్నారు.
అక్కడ టన్నుకు రూ.450-500 వరకు చెల్లిస్తున్నారు. పెద్ద పెద్ద లారీల్లో 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. రవాణా, ఇతర ఖర్చులు కలిపి వ్యాపారులకు మరో రూ.30వేలకు ఖర్చు వస్తున్నది. ఇసుకను ఇక్కడకు తరలించిన తర్వాత వ్యాపారులు ఇసుకును బ్లాక్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం టన్ను సన్న ఇసుక ధర రూ.2,500 వరకు ఉండగా.. దొడ్డు ఇసుక ధర రూ.2వేల వరకు ఉన్నది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్, మైనింగ్, రవాణా శాఖల అధికారులను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నది. దీంతో ఇసుక రవాణా తగ్గడంతో లారీ యజమానులు, దళారులు ధరలు పెంచి ఇసుకను విక్రయిస్తున్నారు. నేటికీ ప్రభుత్వం ఇసుక పాలసీపై స్పష్టత ఇవ్వకపోవడంతో నిర్మాణాలు చేపడుతున్నవారికి ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాలో మాడ్గుల మండలంలో పలు వాగుల వద్ద ఇసుక దందా జోరుగా సాగుతున్నది. అలాగే.. ఇసుకకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో కృత్రిమ ఇసుక దందా సైతం గుట్టుగా సాగుతున్నది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ.. పర్యావరణానికి విఘాతం కలిగించే కృత్రిమ ఇసుకను అక్రమార్కులు యథేచ్ఛగా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఓ వైపు వాగుల్లోని ఇసుకను కొల్లగొట్టడమే కాకుండా గుట్టలు, పొలాల్లోని మట్టిని సైతం ఇసుకగా మార్చేస్తూ.. అక్రమ దందాను నడిపిస్తున్నారు. కృత్రిమ ఇసుకను గృహ నిర్మాణాల్లో వినియోగిస్తే నాణ్యత దెబ్బతినే అవకాశం ఉండి భవిష్యత్తులో యజమానులకు తీరని నష్టం వాటిల్లనున్నది. కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలో కొందరు వ్యక్తులు కృత్రిమ ఇసుకను తయారు చేసి ఆమనగల్లు, కడ్తాల్ తదితర ప్రాంతాలకు తరలిస్తుండగా.. ఇటీవల పోలీసులు ఇసుక డంప్ను సీజ్ చేసి టిప్పర్, జేసీబీ, ట్రాక్టర్ను స్వాధీనపర్చుకున్నారు. అడపాదడపగా కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కృత్రిమ ఇసుక దందాకు మాత్రం పూర్తిస్థాయిలో చెక్ పడడం లేదు.