బొంరాస్పేట, జూలై 5 : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏడాదిలో రెండుసార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది. ప్రారంభంలో 50 శాతం, మిగతా 50 శాతం నిధులను విద్యా సంవత్సరం మధ్యలో విడుదల చేస్తారు. 2023-24 విద్యా సంవత్సరానికి ప్రారంభంలోనే నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల నిర్వహణతో పాటు క్రీడలను నిర్వహించడానికి ప్రభుత్వం వేరుగా నిధులను విడుదల చేసింది. వికారాబాద్ జిల్లాలో 988 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటికి నిర్వహణ నిధులు ఏడాదికి రూ.2.75 కోట్లు మంజూరయ్యాయి. మొదటి విడుతలో 50 శాతం నిధులు రూ.1.37 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా 50 శాతం తర్వాత విడుదల చేస్తారు. అలాగే క్రీడల నిర్వహణకు 988 పాఠశాలలకు రూ.31.75 లక్షలను ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు విడుదల చేసింది.
నిధుల పంపిణీ ఇలా..
ప్రభుత్వం విడుదల చేసిన పాఠశాలల నిర్వహణ నిధులను జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 988 పాఠశాలలకు అధికారులు కేటాయించనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఒకటి నుంచి 30 మంది విద్యార్థులున్న పాఠశాలలు 308 ఉన్నాయి. వీటిలో ఒక్కో పాఠశాలకు రూ.10వేలు విడుదల చేస్తారు. 31 నుంచి 100 మంది విద్యార్థులున్న 430 పాఠశాలలకు రూ.25 వేల చొప్పున, 101 నుంచి 250 మంది విద్యార్థులున్న 202 పాఠశాలలకు రూ.50వేలు, 251 నుంచి 1000 మంది విద్యార్థులున్న 48 పాఠశాలలకు రూ.75 వేల చొప్పున స్కూల్ గ్రాంట్స్ను ప్రభుత్వం విడుదల చేసింది. అలాగే క్రీడల నిర్వహణకు 706 ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, 112 ప్రాథమికోన్నత, 170 ఉన్నత పాఠశాలలకు రూ.10 వేలు చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు ఆయా పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి.
వీటి కొనుగోలుకు…
ప్రభుత్వం విడుదల చేసిన నిధులను పాఠశాలల నిర్వహణ కోసం హెచ్ఎంలు వాడుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ బిల్లులు, చాక్పీస్లు, డస్టర్లు, రిజిష్టర్లు, తెల్లకాగితాలు, డిజిటల్ తరగతులతో పాటు కంప్యూటర్ ప్రొజెక్టర్ల నిర్వహణ, కావాల్సిన సామగ్రి కొనుగోలు, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, ప్రయోగశాలలకు కావాల్సిన పరికరాల కొనుగోలు, ఇతర మరమ్మతులకు ఈ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో పాఠశాలల్లో ఆటల పోటీల నిర్వహణ, బహుమతులు ప్రదానం చేయడానికి నిధులు మంజూరయ్యేవి కావు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంచడానికి నిధులు విడుదల చేస్తున్నది. ఈ నిధులతో ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు.
నిధులను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం పాఠశాలలకు విడుదల చేసిన నిర్వహణ నిధులు, క్రీడా నిధులు ఆయా పాఠశాలల ఖాతా ల్లో జమవుతున్నాయి. వీటిని హెచ్ఎంలు పాఠశాలలకు కావాల్సిన అవసరాలకు వాడుకుని సద్వినియోగం చేసుకోవాలి. మొదటి విడుతగా 50 శాతం నిధులు విడుదలయ్యాయి.
– రేణుకాదేవి, డీఈవో, వికారాబాద్
పాఠశాల అవసరాలు తీరుతాయి
పాఠశాలలకు నిర్వహణ నిధులు ప్రారంభంలోనే విడుదల చేయడం సంతోషం. ఈ నిధులతో పాఠశాలలకు కావాల్సిన చాక్పీస్లు, రిజిష్టర్లు, డస్టర్లు తదితర వాటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆటలకు కూడా నిధులు విడుదల చేయడంతో పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి వారిని క్రీడల్లో రాణించేలా తయారు చేయవచ్చు.
– రవీందర్గౌడ్, హెచ్ఎం, పూర్యానాయక్తండా, బొంరాస్పేట మండలం