కందుకూరు, మే 28 : మారుమూల గ్రామాలకూ మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నది తెలంగాణ సర్కార్. తొమ్మిదేండ్లలో కోట్లాది రూపాయలతో కొత్త రోడ్ల నిర్మాణం, పాతరోడ్ల పునరుద్ధరణ, అవసరమైన చోట బైపాసులు, వంతెనలు, కల్వర్టులను నిర్మించింది. దీంతో వానకాలంలోనూ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణం సాఫీగా సాగిపోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే ప్రయాణం నరకప్రాయంగా సాగేది. రోడ్లకు మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకునే నాథుడే లేకుండే.. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. అందుకు నిదర్శనం లేమూరు రహదారి.
శ్రీశైలం రహదారి నుంచి సరస్వతిగూడ, అగర్మియగూడ. రాచులూరు, తిమ్మాపూరు, గూడూరు, బేగంపేట్. గుమ్మడవెళ్లి తదిరత గ్రామాల వెళ్లే రహదారిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని.. తక్షణమే రూ.9కోట్లు మంజూరు చేసి ఆ రహదారిని బాగు చేయించారు. దీంతో ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. నాడు ప్రమాదాలు జరిగే రహదారిలో.. నేడు ఎలాంటి ప్రమాదాలు జరుగడం లేదు. అందుకు నిదర్శనం మారుమూల గ్రామాలకు వేసిన రోడ్లే నిదర్శనం చెప్పక తప్పదు.
ప్రయాణం సులభతరం..
శ్రీశైలం రహదారి నుంచి తమ గ్రామాలకు వెళ్లాలంటే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేది. ఎన్నిమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించనా ప్రయోజనం లేకుండే.. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తే.. సమస్యను తెలుసుకొని రూ.9కోట్లు కేటాయించి చక్కగా రోడ్డును వేయించారు. దీంతో తమ ప్రయాణం సులభతరంగా ఉంది. ప్రజలు సంతోషడుతున్నారు.
– జంగిలి పరంజోతి, సర్పంచ్, లేమూరు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తమ గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాల హయంలో పడరాని ఇబ్బందులు పడ్డాం. తమ గ్రామంతో పాటు అగర్మియగూ, లేమూరు, తిమ్మాపూరు, గూడూరు తదితర గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పాటు చేయడంతో ప్రయాణం చక్కగా జరుగుతుంది. ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– రాము, సర్పంచ్ సరస్వతిగూడ