మంచాల, మార్చి 20 : గ్రామీణ ప్రాంతాల్లో యువతను క్రీడల్లో మెరికల్లా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. పల్లెప్రకృతి, హరితహారంతో ఇప్పటికే గ్రామాల్లో ఆహ్లాదకర వాతావరణం సంతరించుకోగా పల్లెపల్లెకు క్రీడా ప్రాంగణం ఉండాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంచాల మండలంలో 31 గ్రామాలకుగాను, 27 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి పనులనూ పూర్తి చేశారు. మండలంలోని ఆగపల్లి, మంచాల, ఆరుట్ల, నోముల, రంగాపూర్, జాపాల, చిత్తాపూర్, తాళ్లపల్లిగూడ తదితర గ్రామాల్లోని క్రీడా స్థలాల్లో పనులు వేగంగా పూర్తి చేశారు.
క్రీడలపై గ్రామీణ యువతకు ఆసక్తి పెరిగేలా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లోనూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. కొన్ని గ్రామాల్లో క్రీడా స్థలాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. క్రీడా మైదానాల గుర్తింపు కోసం మండలానికి ప్రత్యేక అధికారిని నియమంతిచడంతో గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూముల అనువైన స్థలాలను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు నివేదికను పంపడంతో ఈ గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు పూర్తి చేశారు.
క్రీడాకారులకు దేవుడు కేసీఆర్..
క్రీడా ప్రాంగణాలు గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రతి పల్లెలో ఆట స్థలం ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఉత్సాహవంతులైన క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం సాధించి రాణించాలి.
– హరిప్రసాద్, అస్మత్పురం సర్పంచ్
క్రీడా స్థలాలను గుర్తించాం..
ప్రతి గ్రామం, అనుబంధ గ్రామాల్లోనూ క్రీడా స్థలాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశాం. మండలంలో 27 గ్రామాల్లో స్థలాను గుర్తించి పనులు సైతం పూర్తయ్యాయి. కొన్ని గ్రామాల్లో అనువైన స్థలాలు లేవు. త్వరలో స్థలాలను గుర్తిస్తాం.
– అనిత, తహసీల్దార్