వికారాబాద్ : భూముల క్రమ, విక్రయాలపై వ్యవసాయ రైతులకు అవగాహన లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, దళారులు భూమి యాజమానులకు అత్యాశ చూపి వారి భూములను రిజిస్టర్ చేసుకొని డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైన ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. రైతుల భూములను కొనుగోలు చేసిన వారు అక్రమంగా వెంచర్లు చేసి, ప్రజలకు అమ్మి మోసం చేసి ఇబ్బంది పాలు చేయడం జరుగుతుందని వివరించారు. జిల్లా ప్రజలకు ఇటువంటి వాటిపై అవగాహన లేకుండా మోసపోతున్నారన్నారు.
ప్రతి పోలీస్ అధికారి తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు దళారుల మోసంపై అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకరావాలని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వివాదాస్పద భూములపై కేసులు చేయాల్సి వస్తే, రెవెన్యూ అధికారుల ద్వారా సరైన ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ దందాలను నివారించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.