మంచాల, మే 9 : నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను నేరుగా సేకరించేందుకు రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి అర్హుల జాబితాను తయారు చేశారు. తహసీల్దార్ అనిత ఆధ్వర్యంలో అధికారులు లబ్ధిదారుల వివరాలను సేకరించారు. మంచాల మండలం లింగంపల్లి గేట్ సమీపంలోని సర్వే నంబర్ 100లో నాలుగు ఎకరాల ఇరవై గుంటల భూమిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. లింగంపల్లి గేట్ వద్ద నిర్మించిన డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మంచాల మండలంలోని నోముల, లింగంపల్లి, మంచాల గ్రామాలకు చెందిన 96 మంది లబ్ధిదారులకు మొదటి విడుతలో ఇండ్లను అందించనున్నారు. అర్హుల ఎంపిక కోసం ఆన్లైన్లో వచ్చిన 420 దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రతి గ్రామానికి 7మందితో కూడిన పంచాయతీ, రెవెన్యూ అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. దీంతో 3 గ్రామాల్లో కులాలకు అతీతంగా 30మంది చొప్పున లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి నంబర్లను కూడాఅందజేశారు.
త్వరలో సొంతింటిలోకి..
సొంతింటి కల నెరవేరనుండడంతో మంచాల, లింగంపల్లి, నోముల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి 90 మందిని ఎంపిక చేయగా అందులో నోముల, మంచాల గ్రామాల్లో గ్రామ సభల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ చొప్పున ప్రతి గ్రామంలో లాటరీ పద్ధతి ద్వారా 30 మందిని ఎంపిక చేసి లాటరీ నంబర్ను రెవెన్యూ అధికారుల సమక్షంలోనే కేటాయించారు.
ఇండ్లు లేని వారికి అందజేస్తున్నాం..
లింగంపల్లి గేటు సమీపంలోని ఇండ్లను ఆర్హులకు అందజేస్తున్నాం. లింగంపల్లి, నోముల, మంచాల గ్రామాల్లోని నిజమైన అర్హులను గుర్తించి లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయించాం. సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను ఇస్తుండడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నోముల, మంచాల గ్రామాల్లో 60 మంది లభ్ధిదారులను ఎంపిక చేశాం. త్వరలో లింగంపల్లిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం.
– మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే
నోముల, మంచాలలో లబ్ధిదారుల ఎంపిక..
ఆన్లైన్ దరఖాస్తులను పరిశీలించి నోముల నుంచి 85 మందిని అర్హులుగా గుర్తించాం. మంచాలలో 95 మంది ఇండ్లులేని వారిగా గుర్తించగా అందులో మంచాల, నోముల గ్రామాల్లో కులాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో 30 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశాం. లింగంపల్లిలో అర్హులకు ఇండ్లను కేటాయించి గృహప్రవేశాలను కూడా చేయిస్తాం.
– అనిత, తహసీల్దార్
పేదలకు రాష్ట్ర సర్కార్ అండ..
పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. ముందుగా 96 మందికి ఇండ్లు ఇవ్వడం సంతోషకరం. స్థలం ఉండి ఇల్లు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.3లక్షలు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బద్రీనాథ్ గుప్తా