కొడంగల్ : చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి భాస్కర్ తెలిపారు. శనివారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆజాది కా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులకు చట్టాల గురించి వివరించారు. 14 సంవత్సరాలలోపు బాల, బాలికలు విద్యాహక్కు చట్టం ప్రకారం చదువుకోవాలని, ఎటువంటి వేతనపు పనులు చేపట్టవద్దనే నిబంధన ఉన్నట్లు తెలిపారు. నేటి రోజుల్లో సెల్ఫోన్లు వంటి మాధ్యమాల వల్ల యువత పెడదారిన పడుతుందని, గుర్తు తెలియన వ్యక్తులతో ఫోన్ ద్వారా పరిచయాలు పెంచుకోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నట్లు తెలిపారు.
విద్యార్థి దశలో చదువుపై శ్రద్ధ వహిస్తే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు ఉన్నత పదవుల్లో రాణించే ఆస్కారం ఉంటుందని తెలిపారు. బాలికలకు ప్రత్యేకంగా చట్టాలు అమలులో ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు సుధాకర్రెడ్డి, బస్వరాజ్, వెంకటయ్యతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.