కొత్తూరు రూరల్ : గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలంలోని వివిధ గ్రామాల్లో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతసత్యనారాయణ అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ రోడ్లు, అంతర్గత మురుగుకాల్వ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు తెలిపారు.
గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించటమే టీఆర్ఎస్ ప్రభుత్వ పరమావధి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను నిరాశపర్చిందన్నారు. ముఖ్యంగా బడ్జెట్లో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ. 55లక్షలు, జడ్పీ నిధుల నుంచి రూ. 15.5 లక్షలను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మధుసూదన్రెడ్డి, వైస్ఎంపీపీ శోభ, రాములుగౌడ్ పాల్గొన్నారు.