ఇబ్రహీంపట్నం : హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతాలు దినదినాభివృద్ధిలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలోని ఎస్వీ డెవలఫర్స్ అధినేత, తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్కైలాన్హోమ్స్ విల్లాల బ్రోచర్ ఆవిష్కరణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నగరశివారు ప్రాంతాలైన ఆదిబట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీల్లో విల్లాలు, అపార్ట్మెంట్ల సంస్కృతి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పెరిగిపోయిందన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తోందని ఆయన అన్నారు.
ఆదిబట్ల మున్సిపాలిటి పరిధిలో ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో ఉద్యోగుల సంఖ్య కూడా బాగా పెరిగే అవకాశముందన్నారు. ఇప్పటికే ఆదిబట్లలో టీసీఎస్తో పాటు ఎరోస్పేస్ సంస్థలు ఏర్పాటయ్యాయని, భవిష్యత్తులో మరిన్ని ఐటీ సంస్థలు కూడా ఏర్పాటయ్యే అవకాశమున్నందున ఈ ప్రాంతంలో రియల్ఎస్టేట్ రంగంతో పాటు నిర్మాణరంగం కూడా అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. భవిష్యత్లో ఆదిబట్ల పరిసర ప్రాంతాల్లో ఐటెక్సిటి తరహాలో ఏర్పాటు కానున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్మాణరంగ సంస్థలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఓఆర్ఆర్ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుందని అన్నారు. ఇప్పుడిప్పుడే విల్లాల సంస్కృతి కూడా ప్రారంభమైందన్నారు.
సామాన్యులకు అందుబాటులో అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారని, అలాగే, సంపన్నులకు సైతం అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక హంగులతో విల్లాలు కూడా నిర్మాణం జరుగుతున్నాయని అన్నారు. నిర్మాణరంగ సంస్థలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చే విధంగా నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, మంచాల జడ్పీటీసీ మరి నిత్యనిరంజన్రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ నిరంజన్రెడ్డి, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ వెంకటేష్, ఆదిబట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కోరె కళమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.