ఇబ్రహీంపట్నం రూరల్ : ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఇబ్రహీంపట్నం సీనియర్ సివిల్జడ్జి ఇందిరా అన్నారు. ఆజాది అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని నాగన్పల్లి గ్రామంలో చట్టాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే సమస్యకు పరిష్కార మార్గాలు సులభంగా దొరుకుతాయన్నారు. రాజీ పడదగిన కేసుల్లో రాజీ చేసుకోవడం వలన ఇరుపక్షాలకు సత్వర న్యాయం జరుగుతుందన్నారు. కలహాలు వదిలి కలిసి జీవించడానికి ప్రయత్నించాలని సూచించారు.
అనవసరమైన గొడవలకు దిగి జీవితాలను వృథా చేసుకోకుండా రాజీమార్గంలో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి లోక్అదాలత్ ప్రాముఖ్యతను వివరిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అరుణ్కుమార్, రవి, పాఠశాల ప్రధానోపాద్యాయురాలు అలివేలు, విద్యార్థులు పాల్గొన్నారు.