ఇబ్రహీంపట్నం : మార్కెట్లో డిమాండ్లేని పంటలు వేసి రైతులు నష్టపోవద్దని, డిమాండ్ ఉన్న పంటలను వేసుకుని అధిక లాభాలను పొందాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డులో వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిపంట దిగుబడి అధికంగా కావటం వలన కొనుగోళ్లు పూర్తిగా స్థంబించిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వచ్చే యాసంగి సీజన్లో కూడా వరిపంట వేసి రైతులు మరింత నష్టపోవద్దని ఇప్పటికే ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవని ప్రకటించినందున రైతులు ముందు జాగ్రత్తగా యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఆయన అన్నారు.
ముఖ్యంగా ఆరుతడి పంటల్లో పప్పు దినుసులకు మంచి డిమాండ్ ఉందని అందువలన కంది, మినుములు, పెసర్లు, వేరుశెనగతో పాటు కూరగాయల తోటలను వేసుకోవాలని సూచించారు. వచ్చే సీజన్లో పప్పుదినుసుల పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని, అలాగే, కూరగాయల పంటలు సాగుచేసే రైతులు కూడా మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నగరానికి అతి చేరువలో ఉన్నందున రైతులంతా ఎక్కువగా కూరగాయల పంటలసాగుపైన దృష్టి సారించాలన్నారు. మరోవైపు కూరగాయల రైతులకు ప్రభుత్వం అన్నిరకాల విత్తనాలు, ఎరువులు, నారు అందించడంతో పాటు మంచి మార్కెట్ సౌకర్యం కూడా కల్పిస్తుందన్నారు. రైతులు నష్టపోవద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని, విస్తృతంగా ప్రచారం చేస్తుందన్నారు.
గ్రామాల్లో రైతు వేదికల ఆధ్వర్యంలో రైతు సదస్సులు నిర్వహించి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏ సీజన్లో ఏ పంటలు వేసుకోవాలని, ఏ నేలలో ఏ పంటలు వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయని పలు సూచనలు, సలహాలు ఇస్తారని వారి సలహాల మేరకు మెట్టపంటలు సాగుచేసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఆరుతడి పంటలసాగుపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా ప్రభుత్వం నిర్వహిస్తుందని, అలాగే, వ్యవసాయ శాస్త్రవేత్తలు అధిక లాభాలిచ్చే పంటలను కూడా సాగు చేసుకునే విధానంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. యాసంగిలో రైతులంతా వరిని పక్కనబెట్టి ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని కోరారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో వరిపంటకు డిమాండ్ లేనందున రైతులు ఆరుతడి పంటలు, కూరగాయల పంటలపైన దృష్టి సారించాలన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు కృపేష్, నర్మద, సుకన్య, మార్కెట్కమిటి మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, జడ్పీటీసీలు మహిపాల్, జంగమ్మ, సహకార సంఘం చైర్మన్లు సుదర్శన్రెడ్డి, సభ్యులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.