బంట్వారం : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగ, అంకిత భావంతో పని చేయాలని ఎమ్మేల్యే ఆనంద్ అధికారులను హెచ్చరించారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా, మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఆయన పర్యటించి, పలు సమస్యలపై స్థానిక ప్రజలతో ముఖాముఖీ చర్చించారు. స్థానికంగా మిషన్ భగీరథ నీరు గుట్టపైకి రావడం లేదని, ఈ సమస్యను స్థానిక సిబ్బందికి చెప్పిన చేయడం లేదని చెప్పారు. దీంతో వెంటనే ఏఈ వేణుమాదవ్ను పిలిచి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి, తాగు నీరును ప్రతి ఇంటికి అందించెల చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా స్థానికంగా పని చేస్తున్న ఏఎన్ఎం గ్రామానికి రావడం లేదని, ఆరోగ్య సమస్యలు వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై వైద్యాధికారి కృష్ణను ప్రశ్నించగా, ఏఎన్ఎం గైర్హాజరయ్యారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటు, ఇలా విధులకు ఎగనామం పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారికి సూచించారు.
తదానంతరం గ్రామంలో లూజ్ లైన్లు మార్చాలని, రోడ్డు సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని విద్యుత్ అధికారులకు పలుమార్లు చెప్పిన చేయడం లేదని గ్రామస్తులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇదే కాక విద్యుత్ సరఫరా కోసం డీడీలు కట్టి ఐదు ఏండ్లు అవుతున్న తమకు ఇప్పటికీ కనెక్షన్ ఇవ్వడం లేదని స్థానిక రైతురత్నం ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే డీఈతో ఫోన్లైన్లో మాట్లాడి సమస్యను వారం రోజుల్లోగా పరిష్కరించి, తనకు ఫొటోలు పెట్టాలని ఆదేశించారు. స్థానికంగా పని చేస్తున్న వెటర్నరి డాక్టర్ సక్రమంగా తమ గ్రామానికి రావడం లేదని, ఇక్కడికి వచ్చే గోపాల మిత్రలు రైతుల వద్ద డబ్బులు తీసుకొని చికిత్సా చేస్తున్నారని పలువురు రైతులు ఎమ్మెల్యే ముందు విన్నవించుకున్నారు. దీనిపట్ల పశువైద్యాధికారి కుమారస్వామిని ఎమ్మెల్యే మందలించి, ఇలాంటి చర్యలకు మరోమారు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో 24మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేద ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని, ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కారాదని భావించి, పెళ్లి పెద్దగా ఖర్చుల కొరకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంతో లక్ష నూట పదహారు రూపాయలను అందజేస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు నర్సింహులు, లావణ్య, డిప్యూటీ తాసిల్దార్ నాగార్జునరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు నర్సింలు, ఆయా గ్రామాల సర్పంచులు, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, నాయకులు చందుసింగ్, మల్లేషం, శరణురెడ్డి, శ్రీనివాస్, రైతుబంధు అధ్యక్షుడు ఖాజాపాష పాల్గొన్నారు.