తుర్కయాంజల్ : అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కయాంజల్ రాగన్నగూడలోని ఎంవీ కన్వేన్షన్ హాల్లో చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సమావేశం నిర్వహించారు. వార్డుల పరిధిలో నెలకొన్న పలు సమస్యలను ఆయా వార్డు కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు వివరించారు. ముఖ్యంగా వార్డుల పరిధిలో మిగిలిపోయిన కాలనీల్లో కృష్ణ వాటర్ పైపులైన్లు వేయించాలని కౌన్సిలర్లు సభలో కోరగా ఎమ్మెల్యే సంబంధిత హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన చోట కృష్ణ వాటర్ పైపులైన్లు వేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యలపై పలువురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి మాసాబ్ చెరువులోకి వస్తున్న మురుగు నీరుతో చెరువు పూర్తిగా కలుషితం అవుతుందని చైర్పర్సన్ అనురాధ అన్నారు. అలాగే మస్కటి వద్ద ప్రధాన సమస్యగా ఉన్న మురుగు నీరు పరిష్కారానికి సంబంధిత యాజమాన్యంతో పాలకవర్గం మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా తుర్కయాంజాల్లోని సర్వే నంబర్ 279లో మున్సిపాలిటీ భవన నిర్మాణం కోసం సభలో తీర్మాణం చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ కలిసి సమిష్టిగా పని చేస్తేనే మున్సిపాలిటీ ప్రగతి సాధిస్తుందన్నారు. మాసాబ్ చెరువులో కలుస్తున్న మురుగు నీటి సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
రాగన్నగూడ, మన్నెగూడ, శోభానగర్ మురుగు నీరు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మున్సిపాలిటీ నుంచి రూ. 3కోట్లు కేటాయిస్తే తన నిధుల నుంచి మరో రూ. 3 కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్యాలయం వేర్వేరు చోట్ల ఉంటే పాలనాపరమైన సమస్యలు తలెత్తుతాయని, రెండు ఒకే దగ్గర ఉండేలా పాలకవర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. క్యాంపు కార్యాలయం తన సొంత నివాసం కాదని పార్టీలకు అతీతంగా కౌన్సిలర్లు ఎవరైనా తమ సమస్యలను అక్కడికి వచ్చి చెప్పుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీలను పక్కన పెట్టి సమీష్టి భాగస్వామ్యంతో పని చేస్తేనే మున్సిపాలిటీ ముందుకు వెళ్తుందన్నారు. వచ్చే సమావేశానికి తాను తప్పకుండా హాజరు అవుతానని అప్పటి కల్లా మున్సిపాలిటీ పాలనా విధానంలో సమూల మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటచారి, కమిషనర్ మండల్ దేవేందర్రెడ్డి, వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హరిత, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్స్ ఫోరం అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ, టీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ రమావత్ కళ్యాణ్నాయక్, కాంగ్రెస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొశిక ఐలయ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.