వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్
షాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదారాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 12 సీట్లకు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందని, నవంబర్ 16న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. 16-23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన, 26లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందన్నారు. డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఓటర్లుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు వ్యవహరిస్తారని తెలిపారు. పోలింగ్ నిర్వహణకు అనువైన కేంద్రాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. జిల్లా స్థాయి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల జాబితా ఫైనల్ చేసి పంపాలని అధికారులకు సూచించారు.
ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు జిల్లాలవారీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితా పంపాలని అధికారులకు సూచించారు. ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 మంది కంటే అధికంగా ప్రజలు హాజరుకావద్దని, బైకు ర్యాలీ, కార్ల ర్యాలీలకు అనుమతి లేదని, ఇంటింటికి క్యాంపెన్ 5మంది, వీడియో వ్యాన్ క్యాంపెన్ 50మంది, 72గంటల ముందుగానే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని తెలిపారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కరోనా మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో నియమాలను పాటిస్తూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకునేలా వారికి ముందస్తుగా అనుమతులు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాన్ఫరెన్స్లో రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, అదనపు కలెక్టర్లు ప్రతీక్జైన్, తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.