కులకచర్ల : పాంబండ దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. కార్తీకమాసం సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయ చైర్మన్ రాములు, ఈవో సుధాకర్, దేవాలయ కమిటీ సభ్యులు, పూజారుల ఆధ్వర్యంలో లక్షబిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాంబండ దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. దేవాలయ ఆవరణలో రూ. 11 లక్షలతో ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేశారు. దేవాలయం ఆవరణలో కళ్యాణమండపం ఏర్పాటుకు రూ. 50 లక్షలు మంజూరు కోసం దేవదాయ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
పాంబండ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని ఘనంగా సన్మాణించారు. కార్యక్రమంలో ఎంపీపీ సత్యమ్మ, కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, డాపూర్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హరికృష్ణ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, దేవాలయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.