బొంరాస్పేట : కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పాడి రైతులు, మత్స్యకారులకు బ్యాంకు రుణాలు ఇస్తాయని వీటిని రైతులు, మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కిసాన్ క్రెడిట్కార్డు రుణమేళా నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణాలు తీసుకుని ఆర్థికంగా పైకి రావాలన్నారు. నేషనల్ లైవ్స్టాక్ మిషన్ (ఎన్ఎల్ఎం) పథకం ద్వారా రైతులకు రూ. 50లక్షల రుణాలను అందిస్తున్నామని, దీనిలో 50శాతం రాయితీ ఉంటుందని, యువ రైతులు, స్వయం సహాయక సంఘాలు ఈ రుణాలు పొందడానికి ముందుకు రావాలని అనిల్కుమార్ కోరారు. కేసీసీ రుణాలను మార్చి వరకు తీసుకోవాలని సూచించారు.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజరు రాంబాబు మాట్లాడుతూ కిసాన్ క్రెడిట్కార్డు రుణాలు తీసుకోవాలంటే రైతులు బ్యాంకుల్లో తప్పక పంట రుణం తీసుకుని ఉండాలని, మత్స్యకారులైతే సంఘాలలో సభ్యత్వం కలిగి ఉండాలన్నారు. పంటరుణం, కేసీసీ రుణం కలిపి రూ. 1.60లకు మించకుండా ఇస్తామన్నారు. బ్యాంకుల్లో పంటరుణాలు తీసుకున్న రైతులు ఏడాదిలోగా తిరిగి చెల్లిస్తేనే వడ్డీ భారం తగ్గి రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నాబార్డు డీడీఎం ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ పాడిరైతులను, మత్స్యకారులను ప్రోత్సహించడానికి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు అందిస్తున్నామని చెప్పారు.
జిల్లా మత్స్యశాఖ ఏడీ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చేపల చెరువుల తవ్వకానికి, చేపలను అమ్ముకోవడానికి మత్స్యకారులకు రాయితీ రుణాలు అందజేస్తామని, కేసీసీ రుణాలను కూడా అందిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ ఆనంద్, జ్యోత్స్నా, ఏవో రాజేష్కుమార్, ఎస్బీఐ మేనేజర్ లవకుమార్, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.