‘కంటి వెలుగు’కు వచ్చి సమస్యలు తీరడంతో జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న శిబిరాలకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వృద్ధులు, కండ్ల సమస్యలు ఉన్నవారు కండ్లద్దాలు పెట్టుకుని చూపు బాగా కనిపించడంతో మురిసిపోతున్నారు. సమస్యలు అధికంగా ఉన్నవారికి ఆపరేషన్కు వైద్య సిబ్బంది రెఫర్ చేస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలో 17,366 మందికి, వికారాబాద్ జిల్లాలో 5,639 మందికి కంటి పరీక్షలు చేశారు.
షాబాద్, ఫిబ్రవరి 14: అంధత్వ రహిత సమాజాన్ని నెలకొల్పాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. దృష్టి లోపాలతో బాధపడుతున్న వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారింది. మంగళవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 17,366 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది కంటి వెలుగు క్యాంపుల ద్వారా ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను జిల్లా, డివిజన్ స్థాయి, ఆరోగ్యశాఖ అధికారులు, మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించి కంటి పరీక్షలను పర్యవేక్షిస్తున్నారు.
పెద్దఎత్తున తరలివస్తున్న ప్రజలు
చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 17,366 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,096 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 1,798 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
94 గ్రామాలు, 25 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలు
బొంరాస్పేట, ఫిబ్రవరి 14 : అంధత్వం, కంటి జబ్బుల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. నేత్ర సంబంధిత వ్యాధులతో వచ్చిన వారికి జిల్లాలోని 42 కంటి వెలుగు కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చేవారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు కంటి పరీక్షలు చేయించుకునేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం జిల్లాలో 5639 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 1045 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 803 మందికి అద్దాలకు ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 94 గ్రామాలు, 25 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు
– ఎన్.నర్సింహారెడ్డి, కౌకుంట్ల, చేవెళ్ల మండలం
కంటి వెలుగుతో వేరే చోటుకు వెళ్లకుండా ఊర్లోనే పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇస్తున్నారు. కండ్లు మసకగా కనిపిస్తున్నాయి. అందుకే పరీక్షలు చేయించుకున్నా. అద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం మన తెలంగాణలో ప్రవేశపెట్టడంతో మాలాంటి వారికి ఉపయోగపడుతున్నది. సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.