ఆమనగల్లు : వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్న రైతు చైతన్య సదస్సులో పాల్గొనాలని కోరుతూ ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా గాంధీ జాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి గాంధీ సాహితీ కన్వీనర్ గోపాల్ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పంటల మార్పిడి, అరుతడి పంటల వల్ల రైతులకు కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు 200మంది కవులతో మహ కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
సదస్సులో భాగంగా జాతీయస్థాయిలో ఉత్తమ రైతు దంపతులను పుడమి పుత్ర అవార్డులతో సత్కరించనున్నట్లు చెప్పారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి తప్పనిసరిగా సదస్సుకు హాజరవుతానని ఆయన హామినిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సలహాదారులు రమణారెడ్డి, మహిళా కన్వీనర్ వాణీదేవి పాల్గొన్నారు.