తుర్కయాంజాల్ : మునగనూరు సర్వే నంబర్ 120లోని సర్కారుకంచె సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న దళిత రైతుల భూ సమస్యకు న్యాయం జరిగింది. పై సర్వే నంబర్లో ఎంతోకాలంగా కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్న దళిత రైతులు కౌన్సిలర్ వేములు స్వాతి అమరేందర్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఎంతోకాలంగా సాగు చేసుకుంటున్న తమకు న్యాయం చేయాలని రైతులు ఎమ్మెల్యేను అభ్యర్థించారు. కాంగ్రెస్ హయాంలో తమకు లావణి పట్టాలు ఇచ్చే అవకాశం ఉన్న అప్పటి పాలకులు, స్థానిక ప్రజాప్రతినిదులు పట్టించుకోలేదని రైతులు ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కబ్జాలో ఉంటున్న పేద దళిత రైతులకు అప్పుడు పట్టాలు ఇప్పించలేని వారు ఇప్పుడు రైతుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటించడం సిగ్గుచేటన్నారు. అప్పట్లో 20కుటుంబాల రైతులు సాగు చేసుకునే వారని ప్రస్తుతం వారు 80కుటుంబాలు అయ్యారన్నారు. కబ్జాలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 120గజాల చొప్పన పదివేల చదరపు గజాల ఇంటి స్థలాలను కెటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకొని తమకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు దళిత రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, తుర్కయాంజల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేముల అమరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు దోమలపల్లి ప్రమీల, నక్క రాధికశ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నక్క స్రవంతి రమేశ్గౌడ్, నాయకులు మహేందర్, అంజయ్య, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీదాసుగౌడ్ పాల్గొన్నారు.